11-02-2026 12:14:02 AM
కరీంనగర్, ఫిబ్రవరి 10 (విజయ క్రాంతి): కరీంనగర్ నగరంలోని మంచిర్యాల చౌరస్తా సమీపంలో వోక్స్ వ్యాగన్ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. కారు నడుపుతున్న దినేష్ అనే వేములవాడకు చెందిన వ్యక్తి కారు నుండి కిందికి దిగి ఫైర్ సిబ్బందికి ఫోన్ చేయడంతో అగ్నిమాపక అధికారి శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పారు.
సమయానికి ఫైర్ ఇంజన్ రావడంతో ప్రాణాపాయం తప్పింది. నగునూరు దినేష్ వ్యక్తి తన స్నేహితుడు శ్రీధర్ కు చెందిన వోక్స్ వ్యాగన్ నెం. ఏపీ11ఏక్యూ1139 కారులో వేములవాడ నుండి కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చాడు. ప్రభుత్వ ఆసుపత్రి నుండి వెనుదిరిగే సమయంలో మంచిర్యాల చౌరస్తా సమీపంలో ఇంజన్ నుండి పొగలతోపాటు ఒక్కసారిగా మంటలు రావడంతో అతను వాహనం దిగి ఫైర్ సిబ్బందికి ఫోన్ చేయగా వారు వచ్చి మంటలు ఆర్పారు. కారు పూర్తిగా కాలిపోయింది. ఇంజన్ వేడెక్కి వైరింగ్ లోపం వల్ల ఈ సంఘటన జరిగి ఉంటుందని భావిస్తున్నారు.