నల్గొండలో బస్సు-కారు ఢీ.. నాలుగురు మృతి
నల్గొండ: జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామం సమీపంలోని హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఓ ప్రైవేట్ బస్సు కారును ఢీకొట్టడంతో నలుగురు మరణించగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం... చెన్నై నుంచి హైదరాబాద్కు కారులో ఐదుగురు ప్రయాణిస్తుండగా, ఒడిశాకు చెందిన అర్షియా ట్రావెల్స్ బస్సు వారి కారును వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కాగా, అందులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన డ్రైవర్ను వివి ప్రసాద్గా గుర్తించి, చికిత్స కోసం నార్కెట్పల్లిలోని కామినేని ఆసుపత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ధ్వంసమైన కారును తొలగించి మృతదేహాలను వెలికితీయడానికి క్రేన్ను ఉపయోగించాయి. అనంతరం పోస్ట్మార్టం కోసం మృతదేహాలను నల్గొండలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. మరణించిన వారిలో ఎస్బీఐ ఉద్యోగి ప్రసాద్ భార్య, కుమారుడు(10), కుమార్తె(15), స్నేహితుడు శ్రీకర ప్రసాద్(62) ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలంలో లభించిన గుర్తింపు పత్రాల ఆధారంగా, వీరు ఆంధ్రప్రదేశ్లోని కాకినాడకు చెందినవారని, హైదరాబాద్లో నివసిస్తున్నారని తెలిసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్కు అంతరాయం కలిగింది.






