రూ.1000 కోట్ల భూకుంభకోణం.. బయటపెట్టిన హరీష్ రావు!
పెద్దషాపూర్ లో ప్రభుత్వ భూమి ధారాదత్తం
హైదరాబాద్: తెలంగాణలో రూ. వెయ్యి కోట్ల కుంభకోణాన్ని బయటపెడుతున్నామని మాజీ మంత్రి హరీశ్ రావు(BRS MLA Harish Rao) మంగళవారం తెలంగాణ భవన్లో(Telangana Bhavan) నిర్వహించిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. శంషాబాద్ మండలం(Shamshabad Mandal) పెద్దషాపూర్ లో భూమి ధారాదత్తం చేశారని హరీశ్ రావు ఆరోపించారు. 180 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేశారని పేర్కొన్నారు. ఆర్డీవో ఆర్డర్(RDO Order) ను ధిక్కరించి.. ఎమ్మార్వో భూములు అప్పగించారని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
భూములు ధారాదత్తం చేసిన ఎమ్మార్వోను కేవలం ట్రాన్స్ ఫర్(Transfer) చేసి చేతులు దులుపుకున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ భూమిని పట్టా భూమి అని తహసీల్దార్(Tahsildar) ఎలా చెప్పగలుగుతారు? అని హరీశ్ రావు ప్రశ్నించారు. అక్రమాలు జరిగినా ఎందుకు చర్యలు తీసుకోలేదని హరీశ్ రావు మండిపడ్డారు. ఎమ్మార్వో ఆర్డర్ పై ఎందుకు విచారణ చేయలేదన్నారు. ఎమ్మార్వో ఆర్డర్ ను ఎందుకు వెనక్కి తీసుకోలేదన్నారు. ఈ అవినీతితో ప్రభుత్వానికి సంబంధం లేకుంటే.. ఎమ్మార్వో ఆర్డర్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. తప్పుడు ఆర్డర్ ఇచ్చిన ఎమ్మార్వోను డిస్ మిస్ చేయాలన్నారు. భూ అక్రమాలపై ఎందుకు సిట్ వేయరో చెప్పాలన్నారు.






