మౌలిక వసతులు కల్పించండి: సిపిఎం
ఇల్లందు, మే 26 (విజయక్రాంతి): గత ఎనిమిదేళ్లుగా సిఎస్పి గ్రామపంచాయతీ పరిధిలోని దేవులపల్లి యాకయ్యనగర్లో నిరుపేదలు గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారని, అక్కడ కనీస మౌలిక వసతులు కల్పించి తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతూ సిపిఎం మండల పార్టీ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం ఆర్డీవో రామ్మోహన్, ఇల్లందు తహసీల్దార్ సూర్యనారాయణకు తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు.
అధికారులు స్పందించి రెవెన్యూ సిబ్బందితో విచారణ నిర్వహించి ముందుగా మంచినీటి సౌకర్యం, మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు సిపిఎం మండల కార్యదర్శి ఆలేటి కిరణ్కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా తాళ్లూరి కృష్ణ మాట్లాడుతూ గుడిసె వాసుల సమస్యల పరిష్కారం కోసం సిపిఎం నిరంతరం పోరాడుతోందని, అక్కడి నిరుపేదలకు సర్వే నిర్వహించి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంతోష్ వెంకన్న, సుజాత, కోటమ్మ, గోబిరియా, హుస్సేన్, మంగ, వైకుంఠం, రహీమ్ పాషా, కౌసల్య తదితరులు పాల్గొన్నారు.






