కార్మికుల పక్షపాతి బీఆర్ఎస్
- మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి
- 16 నుంచి సెంట్రింగ్ కార్మికుల సమ్మె
జవహర్నగర్, మే 9(విజయక్రాంతి): కార్మికుల పక్షపాతిగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిలిచిందని ప్రజాపాలనలో కార్మికులకు పను లు దొరకకపోవడంతో పూట గడవడం కష్టమవుతుందని సెంట్రింగ్ కార్మికులు రోడ్ల మీదకి వచ్చే రోజులు వస్తున్నాయని సరైన ధరలు పెంచి ఆదుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి డిమాండ్ చేశారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్నగర్లోని బాలాజీ నగర్ సెంట్రింగ్ కార్మికులకు సరైన ధరలు చెల్లించాలని కోరుతూ మాజీ మేయర్ మేకల కావ్య యువజన విభాగం అధ్యక్షుడు భార్గవరామ్ ఆధ్వర్యంలో శనివారం ఎమ్మెల్యే మల్లారెడ్డి సమక్షంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను హరిస్తున్నాయని, వారి బాధలను పట్టించుకోవాలని లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఈ నెల 16 నుంచి సమ్మె చేస్తామని కార్మికులు తెలిపారు. కార్మికులు తమ డిమాండ్లను వినతి పత్రంలో వివరించారు. ఈ కార్యక్రమంలో సెంట్రింగ్ కార్మికులు పాల్గొన్నారు.






