10 August, 2026 | 5:17 AM

బాన్సువాడ పీఎస్‌ఆర్ జర్నలిస్ట్ కాలనీలో ఘనంగా బోనాలు

10-08-2026 12:03 AM

బాన్సువాడ, ఆగస్టు 9 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని పిఎస్‌ఆర్ జర్నలిస్ట్ కాలనీలో ఆదివారం ఆషాడ మాసం పురస్కరించుకొని బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆషాఢ మాసంలో భాగంగా ప్రతి ఏడాది సామూహికంగా జరిపే ఈ వేడుకల్లో కాలనీ మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి, తలపై బోనాలు పెట్టుకుని డప్పు చప్పుళ్లు, భక్తి పాటలతో ఊరేగింపుగా వెళ్లారు.

డబుల్ బెడ్ రూం ల వద్ద ఉన్న పోచమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి గ్రామంలో సుఖసంతోషాలు, వర్షాలు కురవాలని మొక్కులు చెల్లించారు. ఈ కార్యక్రమంలో కాలనీ మహిళలతో పాటు జర్నలిస్టులు సాయగౌడ్, సుభాష్, రాజేశ్వర్ రెడ్డి, గోపాల్, శ్రీనివాస్, పోషీరామ్, చంద్రశేఖర్, మధుసూదన్ రెడ్డి, పంతులు నరేష్, నరేష్ గౌడ్, ప్రచేతన్, దండు విజయ్, సుధాకర్ గౌడ్, నరహరి లక్ష్మణ్, సుధీర్, మల్లికార్జున్, అరుణ్ రెడ్డి, వంశీ తదితరుల కుటుంబ సభ్యులు  పాల్గొన్నారు.