13-02-2026 12:00:00 AM
ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాటు: ఎస్పీ రోహిత్ రాజు
భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 12, (విజయక్రాంతి): శుక్రవారం మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లను చేసినట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఒక ప్రకటనలో వెల్లడించారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
ఎన్నికల నియమావళి ప్రకారం సభలు, సమావేశాలు, విజయోత్సవ ర్యాలీలు నిర్వహించకూడదని తెలిపారు. డీజేల వినియోగం,బాణాసంచా కాల్చడం వంటివి కూడా నిషేధమని తెలియయజేశారు.నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్ట్రాంగ్ రూంల వద్ద పటిష్ట భద్రత ఉంటుందని అన్నారు.ఓట్ల లెక్కింపు కేంద్రాల పరిసర ప్రాంతాలను డాగ్ స్క్వాడ్,బాంబుస్క్వాడ్స్ తో నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. జిల్లాలోని మూడు మున్సిపాలిటీల పరిధిలో పకడ్బందీగా 163 BNSS అమలులో ఉంటుందని అన్నారు.
అభ్యర్థులు, ఏజెంట్లు లెక్కింపునకు హాజరయ్యే అధికారులు నిషేధిత వస్తువుల అయిన అగ్గిపెట్టెలు, లైటర్, ఇంక్ బాటిల్స్, పేలుడుకు కారణమయ్యే ఎలాంటి వస్తువులను లెక్కింపు కేంద్రాల్లోకి తీసుకురాకూడదని తెలిపారు. తనిఖీలు చేసే పోలీసు సిబ్బందికి సహకరించాలని కోరారు. ఎన్నికల అధికారులు జారీ చేయబడిన గుర్తింపు కార్డులు ఉన్న వారికి మాత్రమే లెక్కింపు కేంద్రంలోకి అనుమతి ఉంటుందన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని తెలిపారు.