స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి
కరీంనగర్ క్రైమ్,(విజయక్రాంతి): భూభారతి స్పెషల్ డ్రైవ్ ద్వారా ధరణి 2020 వలన వచ్చిన భూ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు కొరివి వేణుగోపాల్ అన్నారు. శనివారం కరీంనగర్ లోని ఫిలిం భవన్ లో ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఆనాటి ధరణి 2020 నుండి ఈనాటి భూభారతి 2025 వరకు ప్రజల భూ సమస్యలు పరిష్కారం అయినాయా అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు కొరివి వేణుగోపాల్ మాట్లాడుతూ భూభారతి స్పెషల్ డ్రైవ్ పెట్టి మూడు నెలల్లో భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు.
అదేవిధంగా కరీంనగర్ శివారు రేకుర్తిలో 4,500 ఇండ్లు నిషేధిత జాబితాలో ఉన్న వాటిని తొలగించాలన్నారు. అయితే వీరు గత 20 సంవత్సరాల నుండి మొదలుకొని దాదాపు 50 సంవత్సరాల వరకు ఇంటి పన్నులు కడుతూనే ఉన్నారన్నారు. అలాంటి వారి ఇండ్లను కొత్తగా నిషేధిత జాబితాలో కి పొరపాటున పంపడం జరిగిందన్నారు. ధరణి, భూభారతి ఏర్పాటు చేసిన తర్వాత ఎన్ని ఫిర్యాదులు వచ్చినాయి, ఎన్ని పరిష్కారం అయినాయి అనేది ప్రభుత్వం ప్రకటించాలని కోరారు.ధరణి మూలంగా కరీంనగర్ జిల్లాలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు ఉన్నాయి, అవి మళ్లీ పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
భూభారతి సమస్యలపై త్వరలో రాష్ట్ర మంత్రు లు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ , అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లను, అవసరమైతే సిఎం రేవంత్ రెడ్డి ని కలిసి వినతి పత్రం అందజేస్తామన్నారు. అలాగే కరీంనగర్ భూ బాధితులతో కలిసి జిల్లా కలెక్టర్ కు కూడా వినతి పత్రాన్ని అందజేస్తామన్నారు.భూ బాధితులు మాట్లాడుతూ ప్రభుత్వం భూభారతి ద్వారా వెంటనే భూ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అలాగే నిషేధిత జాబితాలో ఉన్న భూములను నిషేధిత జాబితా నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. ఇంకా అనేక అంశాలపై సమావేశంలో చర్చించడం జరిగింది. భవిష్యత్తు కార్య చరణకు త్వరలోనే ముఖ్యలతో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందన్నారు.






