తాండూర్లో 2BHK ఇళ్ల కుంభకోణం
ప్రైవేట్ ట్రస్ట్ చేతిలో పేదల ఇళ్లు
నిబంధనలకు విరుద్ధంగా లబ్ధిదారుల ఎంపికలు
విచారణకు బిజెపి డిమాండ్
తాండూర్,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ పథకంలో వికారాబాద్ జిల్లా తాండూర్లో అక్రమాలు చేసుకున్నాయని విచారణ జరిపి పేదలకు న్యాయం చేయాలంటూ జిల్లా కలెక్టర్కు మంగళవారం బిజెపి నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి ఒక ప్రైవేట్ ట్రస్ట్ ఇష్టారాజ్యంగా ఇళ్ల ఎంపికలు చేసినట్లు ఆరోపించారు.
మే 3వ తేదీ శనివారం ఉదయం 9 గంటలకు పట్టణంలోని A.S GMK చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో మహ్మద్ ముజీబ్ ఖాన్ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ, వైస్ చైర్పర్సన్ రజాక్ మైనారిటీ కమ్యూనిటీకి చెందిన వారి నుండి దరఖాస్తులు స్వీకరించి లక్కీ డ్రా తీసి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా స్థాయి అధికారులెవరూ హాజరు కాలేదు. నిబంధనల ప్రకారం 2BHK ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తిగా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీ ద్వారానే జరగాలి.
దరఖాస్తుదారుల పత్రాలు, నివాసం, అర్హతను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాలి
ఒంటరి మహిళలు, వికలాంగులకు ప్రాధాన్యం ఇవ్వాలి. లబ్ధిదారుడి నుండి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పూర్తి ఉచితంగా ఇళ్లు మంజూరు చేయాలి కానీ ఇవేవీ నిబంధనలు పాటించకుండా అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు 2 బిహెచ్కె ఎంపికలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ భారీ కుంభకోణానికి తెరలేపారని వారు ఆరోపించారు.
ప్రైవేట్ ట్రస్టుకు ఇళ్లు కేటాయించే అధికారం ఎక్కడిది?
అసలు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకొని ఏళ్లుగా ఎదురుచూస్తున్న పేదల పరిస్థితి ఏంటి? ప్రశ్నించారు. జిల్లా అధికారుల కమిటీ ప్రమేయం లేకుండా, కేవలం ఒకే వర్గానికి ఇళ్లు కేటాయించడం పథకం ఉద్దేశానికే విరుద్ధమని, ఇది పూర్తిగా చట్టవిరుద్ధమని అన్నారు. ఈ అక్రమ కేటాయింపును వెంటనే రద్దు చేసి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, అసలైన అర్హులైన పేదలకు న్యాయం చేయాలని బిజెపి మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు కోరారు.






