జనపనార పైలెట్ ప్రాజెక్టు పై అవగాహన సదస్సు
చిట్యాల,(విజయక్రాంతి): చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో జనపనార (జ్యూట్) పైలట్ ప్రాజెక్టు కింద అవగాహన కార్యక్రమం మరియు విత్తనాల పంపిణీ కార్యక్రమం గ్రామ సర్పంచ్ కాటం వెంకటేశం అధ్యక్షతన శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 50 నుంచి 100 ఎకరాల్లో జనపనార సాగు చేయడానికి రైతులు ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వ్యవసాయ అధికారులు రైతులకు జనపనార సాగు విధానం, విత్తనాల విత్తే పద్ధతులు, పంట నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సాగు మెలకువలపై వివరంగా అవగాహన కల్పించారు. అధికారులు మాట్లాడుతూ జనపనార పంట ద్వారా ఎకరాకు సుమారు 12 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉందని తెలిపారు.
అలాగే పంటను క్వింటాల్కు రూ.4,500 నుంచి రూ.5,000 వరకు ధరకు కొనుగోలు చేసేందుకు కొనుగోలుదారులు సిద్ధంగా ఉన్నారని, రైతులకు మార్కెటింగ్ పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ డాక్టర్ ప్రసన్నకుమార్, డైరెక్టర్ గుండె పద్మ, వ్యవసాయ శాస్త్రవేత్త చంద్రశేఖర్, సింగిల్ విండో చైర్మన్ ఏనుగు రఘునాథ్ రెడ్డి, వ్యవసాయ అధికారి (ఏవో) గిరిబాబు, ఉపసర్పంచ్ ఓర్సు సైదులు, సింగిల్ విండో డైరెక్టర్ ఎదుల అజిత్ రెడ్డి, వార్డు సభ్యులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.






