ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన సదస్సు
ఎర్రుపాలెం,(విజయ క్రాంతి): మండల పరిధిలో లక్ష్మీపురం గ్రామంలో జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. మంగళవారం నాడు నిర్వహించిన రైతుల సదస్సులో జిల్లా వ్యవసాయ అధికారి పి వాసవి రాణి, ఇమ్మడి వాణి శ్రీ ఏడిఏ మధిర పాల్గొని రైతులకు అవగాహన కల్పించారు. రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించి, స్థానిక వనరులతో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం దీని ప్రధాన లక్ష్యం అని తెలిపారు. రైతులకు ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించారు.
జీవామృతం, ఘనజీవామృతం, కషాయాలు వంటి సహజ ఇన్పుట్ల వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా నేల ఆరోగ్యం, జీవవైవిధ్యం మరియు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది అని పేర్కొన్నారు. నేలలో సేంద్రియ పదార్ధాన్ని పెంచి నీటి వినియోగ సామర్ధ్యాన్ని మరియు భూసారాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఈ కార్యక్రమంలో లక్ష్మీపురం గ్రామ సర్పంచ్ తల్లపురెడ్డి నాగిరెడ్డి , వ్యవసాయ విస్తరణ అధికారులు కత్తి కృష్ణకుమారి, ఏడుకొండల బాలకృష్ణ మరియు రైతులు పాల్గొన్నారు.






