22-02-2026 01:50:24 AM
బీజేపీ ఎంపీ డీకే అరుణ
హైదరాబాద్, ఫిబ్రవరి 21 (విజయక్రాంతి): తమ పార్టీ ఎమ్మెల్యే వెంకటరమణరెడ్డి సవాల్ స్వీకరించలేక ఆయన ఇంటిపైకి రౌడీలను పురమాయించడం కాంగ్రెస్ ప్రతీకార రాజకీయానికి అద్దంపడుతుందని బీజేపీ ఎంపీ డీకే అరుణ విమర్శించారు. అసత్య ఆరోపణలతో బురద జల్లే ప్రయత్నం చేసి, పారిపోవడం కాదు.. ఆధారాలతో చర్చకు రావాలని ఎమ్మెల్యే సవాల్ చేశారని తెలిపారు. ఈ మేరకు శనివారం ఆమె దాడి ఘటనపై స్పందించారు.
శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా అధికార కాంగ్రెస్ దుందుడుకుగా వ్యవహరిస్తుందని విమర్శించారు. కామారెడ్డిలో కేసీఆర్, రేవంత్ రెడ్డిలను ఓడించడాన్ని జీర్ణించుకోలేకనే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీని ఒంటరిగా ఎదుర్కోలేక.. కాంగ్రెస్, బీఆర్ఎస్లు ఏకమై కక్షా రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి నివాసంపై కాంగ్రెస్ శ్రేణులు దాడికి యత్నించడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీసేలా కాంగ్రెస్ వ్యవహరిస్తుందన్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డితో ఫోన్లో ఆమె మాట్లాడి పరామర్శించి, దాడి ఘటన వివరాలను తెలుసుకున్నారు.