సీఎం ఓవర్సీస్ పథకానికి దరఖాస్తు చేసుకోండి
- మైనారిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎండీ.యాకూబ్ పాషా
కొత్తగూడెం,(విజయక్రాంతి): విదేశాల్లో ఉన్నత విద్యలను అభ్యసిస్తున్న మైనారిటీ విద్యార్థుల కొరకు మైనారిటీ సంక్షేమ శాఖ ద్వారా అందిస్తున్న సీఎం ఓవర్సీస్ పథకానికి అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని మైనారిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎండీ. యాకూబ్ పాషా ఆదివారం నాడు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
తల్లిదండ్రుల వార్షిక ఆదాయం ఐదు లక్షల రూపాయల లోపు కలిగి 01-01-2026 నుంచి 30-06-2026లో అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్, సింగపూర్, జర్మనీ, సౌత్ కొరియా, జపాన్, ఫ్రాన్స్, న్యూజిలాండ్ దేశాలలో పీజీ (ఇంజనీరింగ్) పీహెచ్.డీ (ఇంజనీరింగ్)లలో ప్రవేశాలు పొందిన విద్యార్థులు మాత్రమే ఈ స్కాలర్ షిప్ లు పొందేందుకు అర్హులని పేర్కొన్నారు.
అర్హత కలిగిన విద్యార్థులు తమ పదవతరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ సర్టిఫికెట్లు, జీఆర్ఈ/జీమాట్ పరీక్ష స్కోర్ కార్డు, టోఫెల్/ఐల్ట్స్ స్కోర్ కార్డు, జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్, నివాస ధ్రువీకరణ పత్రం, పాస్పోర్ట్, విదేశీ విధ్యాలయాలలో చేరినట్లు ధ్రువీకరణపత్రం, బ్యాంకు పాసు పుస్తకం, పాస్పోర్ట్ ఫోటో, ఒరిజినల్ ట్రాన్ స్క్రిప్ట్ పత్రాలతో జూన్ 30 వ తేదీ లోపు www.telanganaepass.cgg.gov.in వెబ్ సైట్ నందు తమ వివరాలను నమోదు చేసుకొని హార్డ్ కాపీలను తమ తమ జిల్లాలలో గల మైనారిటీ సంక్షేమ శాఖ కార్యాలయాలలో అందించాలని తెలిపారు.
ఈ ఉపకార వేతనాలకు ఎంపికైన వారికి 20 లక్షల రూపాయలతో పాటు విమాన చార్జీల నిమిత్తం 60 వేల రూపాయలు కూడా అందిస్తారని చెప్పారు. ఈ అవకాశాన్ని మైనారిటీ వర్గాలకు చెందిన ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇతర వివరాలకై 8520860785 నంబర్ కు సంప్రదించాలని కోరారు.






