6 March, 2026 | 11:36 PM

పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్.. ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం

06-03-2026 03:40 PM

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) శుక్రవారం అసెంబ్లీలో 13 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు సోషల్ మీడియా( Social Media Ban) యాక్సెస్‌ను రాష్ట్ర ప్రభుత్వం నిషేధిస్తుందని ప్రకటించారు. సోషల్ మీడియా ప్రతికూల ప్రభావం నుండి పిల్లలను రక్షించే లక్ష్యంతో తీసుకున్న చర్యల్లో భాగంగా ప్రభుత్వం 90 రోజుల్లోగా నిషేధాన్ని అమలు చేస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. 16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వారికి కూడా ఈ పరిమితిని విస్తరించాలని ప్రభుత్వం పరిశీలిస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు.

ఈ ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని, సంప్రదింపుల తర్వాత తదుపరి నిర్ణయాలు తీసుకుంటామన్నారు. ''ఆంధ్రప్రదేశ్‌లో 13 ఏళ్ల వయసులోపు ఉన్నవారికి సోషల్ మీడియా బ్యాన్ చేస్తే బాగుంటుందని రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సూచన వచ్చింది. అందరితో చర్చించి వయసు నిర్ణయిస్తాం. సోషల్ మీడియా చెడు ప్రభావాల వల్ల మన పిల్లలు నష్టపోవటానికి వీలు లేదు. 90 రోజుల్లో దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటాం.'' అని సీబీఎన్ పేర్కొన్నారు. 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా, సెల్ ఫోన్ల వాడకంపై నిషేధం విధిస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(Karnataka Chief Minister Siddaramaiah) అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించారు.