ఎయిర్ పోర్టుతో పాటు ఎయిర్ ఫోర్స్ స్టేషన్
- ఆదిలాబాద్లో స్థల పరిశీలనకు జిల్లాలో పర్యటించిన కేంద్ర రక్షణ శాఖ బృందం
ప్రస్తుత స్థలంతో పాటు మరో 12 వందల ఎకరాలు అవసరమని అంచనా
ఆదిలాబాద్, ఏప్రిల్ 17 (విజయక్రాంతి) : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఎయిర్ పోర్టు కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ప్రజల కల సాకారమయ్యేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇటీవల కాలంలో ఎయిర్ పోర్టు ఏర్పాటు పై ముమ్మరంగా ప్రచారం సాగడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందు కు సాగుతున్నాయి. ఎయిర్ పోర్టుకు ఎంత స్థలం అవసరమో స్పష్టత కోసం శుక్రవారం కేంద్ర రక్షణ శాఖకు సంబంధించిన ఎయిర్ పోర్స్ అధికారులతో పాటు ఎయిర్ పోర్టు అథారిటీ అధికారుల బృంధం జిల్లాలో పర్యటించింది.
శుక్రవారం జిల్లా ఇంచార్జి కలెక్టర్, ఐటిడిఎ పీఓ యువరాజ్ మర్మాట్, ఎమ్మె ల్యే పాయల్ శంకర్, ఎస్పీ అఖిల్ మహాజన్ లతో కేంద్ర ఎయిర్ పోర్స్ అధికారులు రాహుల్ శుక్లా, ఎస్.జీ హెగ్దే, జెపి సబర్వాల్, రాజీవ్, ఎస్ . కె రెడ్డి, ఎండి వసీం, స్వీటీ, రాజ కిషోర్ తదితరులు సమావేశం అయ్యా రు. ప్రస్తుతం ఉన్న ఎయిర్ పోర్స్ స్థలంతో పాటు ఎయిర్ పోర్టు మాస్టర్ ప్లాన్ లో పొం దుపర్చిన స్థలాలను పరిశీలించారు.
పౌర విమానాశ్రయం ఏర్పాటుకు ప్రస్తుతం ఉన్న 365 ఎకరాలకు తోడుగా మరో 465 ఎకరాలు గతంలో గుర్తించారు. అయితే ప్రస్తు తం ఎయిర్ పోర్టుతో పాటు ఎయిర్ పోర్స్ స్టేషన్ ఏర్పాటు చేయాలని కేంద్ర రక్షణ శాఖ నిర్ణయించింది. ఇందుకు అదనంగా 1200 ఎకరాలు అవసరమని రక్షణ శాఖ ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర బృంధం ఇందుకు అవసరమైన, అనువైన స్థలాన్ని గుర్తించేందుకు జిల్లా అధికారులతో కలిసి పరిశీలన జరిపారు.
ప్రస్తుతం రక్షణ శాఖ ఆధీనంలో ఉన్న ఎయిర్ పోర్స్ స్థలంతో పాటు పక్కనే ఉన్న సిసిఐ ఫ్యాక్టరీ స్థలం, లాండసాంగ్వి, అనుకుంట గ్రామాల శివారు ప్రాంతాలను బృంధం సభ్యులు పరిశీలించారు. ఎయిర్ ఫోర్స్ స్టేషన్, ఎయిర్ పోర్టు ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలు, అడ్డకుంలపై అధ్యయనం చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చిత్రు, ఆర్డీఓ స్రవంతి, కాంగ్రెస్ అధ్యక్షుడు నరేష్ జాదవ్, నాయకుల గండ్రత్ సుజాత, శ్రీకాంత్ బోరంచు రెడ్డి, పలువురు అధికారులు తదితరులు ఉన్నారు.






