రాంపూర్లో మద్యపాన నిషేధం
- విక్రయిస్తే రూ.50 వేలు కట్టాల్సిందే..
- గ్రామ సభలో తీర్మానం
- సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలో ఘటన
నంగునూరు, జులై 25(విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని రాంపూర్ గ్రామం అందరికీ ఆదర్శంగా నిలిచింది. యువత చొరవతో సర్పంచ్ గోకా మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన గ్రామసభలో ఊరి బాగు కోసం సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని విధిస్తూ ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ నిర్ణయానికి గ్రామస్తులు,యువకులు పూర్తి మద్దతు తెలిపారు. ఈ తీర్మానం ప్రకారం గ్రామంలో ఎవరైనా మద్యం విక్రయిస్తే వారికి రూ.50 వేలు జరిమానా విధిస్తామని గ్రామ పంచాయతీ స్పష్టం చేసింది.
బెల్టు షాపుల కారణంగా మద్యం ఏరులై పారుతుండటం వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నా యని గ్రహించిన యువకులు ఈ సంచలన నిర్ణయానికి నడుం బిగించారు. సర్పంచ్ గోక మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ గ్రామం బాగు కోసం,భవిష్యత్ తరాల రక్షణ కోసం యువకులు తీసుకున్న నిర్ణయం నిజంగా అభినందనీయమన్నారు. గ్రామస్తురాలు అనిత మాట్లాడుతూ పిల్లల భవిష్యత్తును, మా సుఖసంతోషాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నమన్నది.






