సమృద్ధిగా వర్షాలు కురవాలని నాభిశిలకు జలాభిషేకం
చిట్యాల,(విజయక్రాంతి): చిట్యాల మండలం తాళ్లవెల్లంల గ్రామంలో సోమవారం గ్రామ ప్రజలు సమృద్ధిగా వర్షాలు కురవాలని, పంటలు బాగా పండాలని ఆకాంక్షిస్తూ గ్రామ నాభిశిలకు జలాభిషేకం నిర్వహించారు. ఇటీవల మునిచింతల దేవాలయంలో చిన్న జీయర్ స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించి అభిషేకం చేసిన కలశాన్ని గ్రామంలోని ఆంజనేయస్వామి దేవాలయానికి తీసుకువచ్చి గ్రామ పెద్దలు, మహిళలు, యువకుల సమక్షంలో ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం గ్రామంలోని మహిళలు గ్రామ నాభిశిలకు జలాభిషేకం నిర్వహించి గ్రామం సస్యశ్యామలంగా ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జోగు సురేష్, పజ్జూరి అజయ్ కుమార్ రెడ్డి, పామునుగుల్ల దశరథ, పాలాది శ్రీనివాస్, పామునుగుల్ల మారేష, కొమ్మనపల్లి యాదయ్య, వీరమల్ల రామస్వామి, మాధగోని రమేష్, నకిరేకంటి నాగేష్, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.






