శింబు చిత్రంలో చాన్స్?
కోలీవుడ్ స్టార్ హీరో శింబు ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఆయన వెట్రిమారన్ దర్శకత్వంలో ‘అరసన్’ అనే భారీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. అయితే, ఈ చిత్రం పూర్తి కాకముందే శింబు తన తదుపరి చిత్రాన్ని పట్టాలెక్కించనున్నారు. ఇప్పటికైతే ఇది ‘శింబు51’ అనే వర్కింగ్ టైటిల్తో ప్రచారంలో ఉంది. దీనికి యువ దర్శకుడు అశ్వత్ వైరముత్తు డైరెక్టర్ అని తెలుస్తోంది.
ఇదిలావుండగా ఈ చిత్రంలో నటించే హీరోయిన్లు ఎవరు అనే విషయమై ఇప్పుడు ఫిల్మ్ సర్కిళ్లలో హాట్ టాపిక్ వినవస్తోంది. ఈ సినిమాలో శింబు సరసన ఏకంగా ముగ్గురు క్రేజీ హీరోయిన్లు నటించనున్నారట. ఇప్పటికే టాలీవుడ్ సెన్సేషన్ మీనాక్షి చౌదరి ఎంపికైందని సమాచారం.
ఇక మిగిలిన ఇద్దరు హీరోయిన్ల కోసం చిత్ర యూనిట్ వేట సాగిస్తోందట. రుక్మిణి వసంత్, మృణాల్ ఠాకూర్లతో టీమ్ చర్చలు జరుపుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ ముగ్గురు భామలు ప్రాజెక్టులోకి వస్తే.. శింబు సినిమా మరో స్థాయికి వెళ్లడం ఖాయమంటూ అభిమానులు ఖుషీ అవుతున్నారు.




