హనుమకొండ జిల్లాకు నూతనంగా 12 బస్సులు
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మహిళా సంఘాల బస్సుల ప్రారంభోత్సవం
హనుమకొండ, జూన్ 09(విజయ క్రాంతి):హనుమకొండ జిల్లాలోని 12 మండలాల మహిళా స్వయం సహాయక సంఘాలకు నూతనంగా కేటాయించిన బస్సులను హైదరాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం అందజేశారు. మంగళవారం సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహిళా శక్తి మహాసభకు ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు కేటాయించిన బస్సుల ప్రారంభోత్సవాన్ని నిర్వహించారు.
మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేస్తూ ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా కొనుగోలు చేసిన బస్సులను రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలసి ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పరేడ్ గ్రౌండ్స్ లో ప్రారంభం నేపథ్యంలో జిల్లాలోని 12 మండలాల నుండి దాదాపు 600మంది మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు ఆర్టీసీ బస్సుల్లో ఉదయం బయలుదేరారు.పట్టణ పరిధిలో ఉన్న కాజీపేట,
హనుమకొండ మండలాలు మినహా మిగతా మండలాల నుంచి ప్రతి బస్సులో యాభై మంది మహిళా సంఘాల సభ్యులు, ఏపీఎం, మహిళా పోలీస్, ఆశా కార్యకర్త ఈ కార్యక్రమానికి తరలి వెళ్లారు.పర్యావరణహితమైన ఎలక్ట్రిక్ బస్సులను హనుమకొండ జిల్లాకు 12 బస్సులను కేటాయించగా ఆయా మండలాల మహిళా సంఘాలకు చెందిన సభ్యులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. హైదరాబాద్ కు వెళ్లిన వారిలో డీఆర్డీవో మేన శ్రీను, అడిషనల్ డీఆర్డీవో వెంకటేశ్వర్లు, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు సుజాత, ఆయా మండలాల ఏపీఎంలు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.






