యోగా ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యం
ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జూన్ 21న నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆధ్వర్యంలో సోమవారం “యోగా రన్” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జనరల్ ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ రవీందర్ కుమార్ మాట్లాడుతూ యోగ అనేది కేవలం వ్యాయామం మాత్రమే కాకుండా శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యానికి మార్గదర్శిగా నిలుస్తుందని తెలిపారు. నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలిలో యోగ మనకు ప్రశాంతత, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుందని పేర్కొన్నారు.
ప్రతిరోజూ కొంత సమయం యోగాభ్యాసానికి కేటాయించడం ద్వారా మధుమేహం, రక్తపోటు, ఊబకాయం వంటి జీవనశైలి వ్యాధులను నియంత్రించవచ్చని తెలిపారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగ గొప్ప సాధనమని పేర్కొంటూ జిల్లా ప్రజలందరూ యోగను తమ దైనందిన జీవితంలో భాగంగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిఎన్ఓ విజయమ్మ, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్, నాయకులు మారుతి, ఆయుష్ సిబ్బంది సుజాత, శిల్ప ,ఆసుపత్రి సిబ్బంది, ఆయుష్ విభాగం సిబ్బంది, ప్రజాప్రతినిధులు, కార్మిక సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.






