500 ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలి
ధర్మ సమాజ్ పార్టీ డిమాండ్
గణపురం, జూలై 17 (విజయక్రాంతి): గణపురం మండల కేంద్రంలో నిర్మించిన రెండు గదుల ఇళ్లు నాణ్యత ప్రమాణాలతో లేవని వాటిని వెంటనే కూల్చివేటి వాటి స్థానంలో మరో 500 ఇళ్లను పేద ప్రజలకు నిర్మించి ఇవ్వాలని ధర్మసమాజ్ పార్టీ డిమాండ్ చేశారు. ధర్మ సమాజ్ పార్టీ నాయకులు, వాటి నిర్మాణంలో నాణ్యత లోపాలు ఉన్నాయని ఆరోపించారు. శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా నాయకుడు కండే రవి మాట్లాడుతూ, లోపభూయిష్టంగా నిర్మించిన ఇళ్లను కూల్చివేసి అదే స్థలంలో అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని డిమాండ్ చేశారు.
మండల కేంద్రానికి ఇప్పటివరకు ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు జరగలేదని, బీసీ, ఎస్సీ, ఎస్టీ తదితర వర్గాలకు చెందిన పేదలకు జనాభా నిష్పత్తి ప్రకారం ఇళ్లు ఇవ్వాలని కోరారు. వర్షాకాలంలో నివాస సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గణపురం మండలానికి 500 ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలని, త్వరలోనే ఇళ్ల కేటాయింపు చేయకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో మండల నాయకులు కుర్రి స్వామినాథన్, ఇంజపెల్లి సాగర్ తదితరులు పాల్గొన్నారు.






