6 May, 2026 | 4:01 AM

నా చివరి శ్వాసవరకు ప్రజా సంక్షేమం కోసమే పనిచేస్తా

06-05-2026 02:33 AM

గత ప్రభుత్వం 10 ఏళ్లలో చేయలేని పనులు రెండున్నర ఏండ్లలో చేశాం

అది జీర్ణించుకోలేక గుంపుగా విమర్శలు చేస్తుండ్రు

ప్రభుత్వ విప్ బిర్ల  ఐలయ్య

యాదగిరిగుట్ట, మే 5: నా శ్వాస ఊపిరి ఉన్నంతవరకు ప్రజల క్షేమం కోసమే పనిచేస్తానని నిరంతరం ప్రజల్లోనే ఉంటానని, ఇది చూసి కొంత మంది జీర్ణించుకోలేక నాపై బురద చల్లే వ్యవహారం చేస్తున్నారని ఆ బురద నా మెడలో పూలవలే పడుతున్నాయని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అప్పటి టిఆర్‌ఎస్ ఇప్పటి బీఆర్‌ఎస్ పది సంవత్సరాల పాలనలో చేయలేని పనులను రెండున్నర సంవత్సరాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  సారథ్యంలో పూర్తి చేశామన్నారు.

అది తీయించుకోలేకే ప్రతిపక్ష పార్టీల వారు, వారి పెద్దల మెప్పు కోసం నా పైన విమర్శలు చేస్తున్నారన్నారు. బిఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు తన పై విమర్శలు చేసేందుకు పోటీ పడుతున్నారన్నారు. వీరిలో ఇంకొంచెం ముందుకెళ్లి కల్లూరి రామచంద్ర రెడ్డి తనపై ఎక్కువగా విమర్శలు చేస్తున్నాడని ఎన్నికలవేళ ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామన్నారు. రెండున్నర సంవత్సరాల అనంతరం ఎలక్షన్లలో మాజీ ఎమ్మెల్యే, ఆమె భర్త, మరో ఇద్దరు నాయకులు మొత్తం నలుగురు నాపై పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారన్నారు.

వీరే గ్రూపులుగా విడిపోయి విమర్శలు చేస్తున్నారన్నారు. ఆ పార్టీ కాక మరి ఏ పార్టీ నుండి వచ్చిన ప్రజాక్షేత్రంలో వారికి ఓటమి తప్పదన్నారు. ప్రతిరోజు ప్రతిక్షణం ప్రజల కోసం పాటుపడుతున్నానని ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూనే ఏ ఒక్కరికి ఆపద వచ్చినా బిడ్డలా, కొడుకులా,ఓ తమ్ముడిలా, అన్నలా పనిచేస్తున్నానన్నారు. ప్రజా పాలనలో ప్రజలకు 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, సన్న బియ్యం, పెన్షన్ కొత్త రేషన్ కార్డులు,  పేదలకు సొంతింటి కల ఇందిరమ్మ ఇల్లు, రైతులకు రుణమాఫీ, సన్నవడ్లపై బోనస్, యూరియా, రైతు బంధు, రైతు భీమా, మండలానికో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలను అమలు చేస్తున్నామన్నారు.

ఇది చూసి ఓర్వలేక రైతులను రెచ్చగొడుతూ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారన్నారు. ఇన్ని కార్యక్రమాలను అమలు చేస్తుంటే నా దిష్టిబొమ్మలను తలగబెట్టడం ఎంతవరకు న్యాయమన్నారు. ప్రతిపక్షాలు పనిచేయకపోతే విమర్శించాలి తప్ప చిల్లర మల్లర రాజకీయాలు చేయవద్దని హితువు పలికారు. ఆలేరు అభివృద్ధి కోసం పార్టీలకతీతంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్, కౌన్సిలర్లు బబ్బూరి శ్రీధర్ గౌడ్, ముక్యర్ల మల్లేష్ యాదవ్, పెలిమెల్లి లావణ్య శ్రీధర్ గౌడ్,సాధునేని ధనలక్ష్మి, మాలోతు సరోజ, గుండ్లపల్లి భరత్ గౌడ్, బంధారపు బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.