జనాభా లెక్కల స్వీయ గణన నమోదు చేసుకోవాలి
జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్
సంగారెడ్డి, మే 3(విజయక్రాంతి):జనాభా లెక్కల ప్రక్రియలో భాగంగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ (స్వీయ గణన) విధానం ద్వారా ప్రజలు తమ కుటుంబ వివరాలను తామే నమోదు చేసుకునే సౌకర్యం ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిందని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. ఈ స్వీయ గణన ప్రక్రియ మే 10 వరకు కొనసాగుతుందని, ఈ అవకాశాన్ని జిల్లాలోని ప్రతి కుటుంబం వినియోగించుకుని తమ కుటుంబ వివరాలు నమోదు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
ప్రజలు తమ వివరాలను స్వయంగా నమోదు చేయడం ద్వారా సమయం ఆదా కావడంతో పాటు సమాచారం ఖచ్చితత్వం కూడా పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు.స్వీయ గణన విధానం... ముందుగా https://se.ce nsus.gov.in బ్సైట్ను ఓపెన్ చేయాలి. సెల్ఫ్ ఎన్యుమరేషన్ (HLO) లాగిన్ వద్ద తెలంగాణను ఎంపిక చేసి Captcha నమోదు చేసి వెరిఫై మరియు ప్రొసీడ్ క్లిక్ చేయాలి. వెల్కమ్ పేజీలో కుటుంబ పెద్ద పేరు, మొబైల్ నంబర్ నమోదు చేయాలి. ఒక కుటుంబానికి ఒకే మొబైల్ నంబర్ ఉపయోగించాలి. వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై అండ్ ప్రొసీడ్ ను క్లిక్ చేయాలి. తరువాత నచ్చిన భాషను ఎంపిక చేసుకుని, జిల్లా, గ్రామం/పట్టణం, పిన్ కోడ్ వివరాలు నమోదు చేయాలి.
మొబైల్లో లొకేషన్ ఆన్ చేసి, ఇంటి స్థానం వద్ద రెడ్ మార్క్ సెట్ చేయాలి. ఇళ్లకు సంబంధించిన 33 ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి ప్రివ్యూ ద్వారా చెక్ చేసి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత హెచ్ తో ప్రారంభమయ్యే 11 అంకెల సెల్ఫ్ ఎన్యుమరేషన్ ఐడి వస్తుంది. దానిని స్క్రీన్ షాట్ తీసుకుని లేదా నోట్ చేసుకునిభద్రపరచుకోవాలి.
మే 11 తరువాత గణనాధికారి ఇంటికి వచ్చినప్పుడు ఈ ఎస్ఈ ఐడీని చూపిస్తే వారు ధృవీకరిస్తారని కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకుని తమ కుటుంబ వివరాలను స్వయంగా నమోదు చేసుకోవాలని, ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. బాధ్యతగా మన సమాచారం స్వయంగా నమోదు చేసి సమయాన్ని ఆదా చేసుకుందామని ఆయన పిలుపు నిచ్చారు.






