31 August, 2026 | 8:13 PM

రసాయన శాస్త్రంలో వై.రాజేందర్ రెడ్డికి పీహెచ్‌డీ పట్టా

31-08-2026 07:09 PM

పటాన్ చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, రసాయన శాస్త్ర విభాగం(Department of Chemistry) పరిశోధక విద్యార్థి వై. రాజేందర్ రెడ్డి డాక్టరేట్ కు అర్హత సాధించారు. ‘లక్షిత ఆంకాలజీ ఔషధాలైన ఇబ్రూటినిబ్, బుసుల్ఫాన్, లాపటినిబ్, రుక్సోలిటినిబ్ లలో మలినాల ప్రొఫైలింగ్ నిర్మాణ వివరణ కోసం అధునాతన విశ్లేషణాత్మక పద్ధతులపై ఆయన అధ్యయనం చేసి సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ రసాయన శాస్త్ర విభాగం ప్రొఫెసర్ ఎం.ఎస్. సురేంద్ర బాబు సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు.

డాక్టర్ రాజేందర్ రెడ్డి పరిశోధన, ఇబ్రూటినిబ్, బుసల్ఫాన్, లపాటినిబ్, రుక్సోలిటినిబ్ అనే నాలుగు ముఖ్యమైన ఆంకాలజీ ఔషధాలపై దృష్టి సారించినట్టు తెలియజేశారు. వాటి స్థిరత్వాన్ని అంచనా వేయడానికి, విచ్ఛిన్న ఉత్పత్తులను, ప్రక్రియ సంబంధిత మలినాలను గుర్తించడానికి, ఇంకా వాటి నిర్మాణాలను విశ్లేషించడానికి అధునాతన విశ్లేషణాత్మక పద్ధతులను అభివృద్ధి చేసినట్టు తెలిపారు. LC-MS, HRMS, NMR, ప్రిపరేటివ్ క్రోమాటోగ్రఫీలను ఏకీకృతం చేయడం ద్వారా ఈ అధ్యయనం మలినాలు ఏర్పడటానికి గల సంభావ్య యంత్రాంగాలను కూడా స్థాపించిందన్నారు. ఇది ఔషధ భద్రత, నాణ్యత, నియంత్రణలను మెరుగుపరచడానికి దోహదపడినట్టు వివరించారు.

ఈ పరిశోధన, విశ్లేషణాత్మక ఖచ్చితత్వానికి ఎటువంటి రాజీ పడకుండా, నమూనా పూర్వ-శుద్ధీకరణ, సంక్లిష్ట సంగ్రహణ ప్రక్రియలను తగ్గించడం ద్వారా, సరళమైన, తక్కువ ఖర్చు, పర్యావరణ స్పృహతో కూడిన విశ్లేషణాత్మక విధానాన్ని మరింత వెల్లడించిందన్నారు. డాక్టర్ రాజేందర్ రెడ్డి సిద్ధాంత వ్యాసం పీహెచ్.డీ. పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం హైదరాబాదు అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డి.ఎస్.రావు, గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ సైన్స్ డైరెక్టర్ డాక్టర్ ఎం.రెజా, రసాయ శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ గౌసియా బేగం, పలు విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు అభినందించడమే గాక, ఔషధ రసాయన శాస్త్ర పరిశోధనకు ఆయన చేసిన విలువైన కృషిని ప్రశంసినట్టు వివరించారు. డాక్టరేట్ పరిశోధన అంతటా అంకితభావంతో మార్గనిర్దేశనం చేయడంతో పాటు సలహాలు అందించినందుకు ప్రొఫెసర్ సురేంద్ర బాబును కూడా అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.