ఎస్ఐఆర్ ప్రక్రియలో అర్హులైన ప్రతి ఓటరు జాబితాలో ఉండేలా పనిచేయాలి
నార్నూర్, గాదిగూడ మండలాల్లో బీఎల్ఏలు, కాంగ్రెస్ శ్రేణులతో విస్తృత స్థాయి సమావేశం..
నార్నూర్, జూలై 27(విజయక్రాంతి): అర్హులైన ప్రతి ఒక్కరు ఓటరు జాబితాలో ఉండేలా ఎస్ఐఆర్ ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు(Congress party cadres) బాధ్యతాయుతంగా పనిచేయాలని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క(DCC President Athram Sugunakka) అన్నారు. నార్నూర్, గాదిగూడ మండల కేంద్రాల్లో ఆదివారం రాత్రి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, బూత్ లెవల్ ఏజెంట్లు,సూపర్వైజర్లతో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో సుగుణక్క పాల్గొని మాట్లాడారు.ఎస్ఐఆర్ ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా ప్రతి ఇంటిని సందర్శించి అర్హులైన ఓటర్ల వివరాలను పరిశీలించాలని సూచించారు. అర్హత ఉన్న ఒక్క ఓటరు కూడా ఓటు హక్కును కోల్పోకుండా బీఎల్ఏలు, పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త బాధ్యత అని పేర్కొన్న సుగుణక్క, ప్రజలకు అవసరమైన అవగాహన కల్పిస్తూ ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే పార్టీ నాయకుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ సమావేశాల్లో నార్నూర్ మండల అధ్యక్షుడు గోవింద్ రావు,అబ్జార్వర్ మహమ్మద్, సూపర్ వైజర్ కేంద్రే సురేష్, కర్మంకర్ శ్యాం సుందర్,గాదిగూడ మండల అధ్యక్షుడు వామన్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సోయం మారుతీ, మండల అబ్జర్వర్ పరుశురాం,సర్పంచులు,బీఎల్ఏలు, సూపర్వైజర్లు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.






