మర్రిగడ్డలో వ్యవసాయ విద్యార్థుల గ్రామ అధ్యయనం
రైతులతో కలిసి వ్యవసాయ సమస్యల గుర్తింపు
చందుర్తి,(విజయక్రాంతి): మండలంలోని మర్రిగడ్డ గ్రామంలో తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో పి.జె.టి.ఎ.యు వ్యవసాయ కళాశాల తుది సంవత్సరం విద్యార్థులు, గ్రామీణ వ్యవసాయ అనుభవ కార్యక్రమంలో భాగంగా గ్రామ స్థాయి అధ్యయన కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతులతో కలిసి గ్రామంలోని ప్రధాన వ్యవసాయ సమస్యలు, అందుబాటులో ఉన్న వనరులు, రైతుల అవసరాలను గుర్తిస్తూ అధ్యయనం చేపట్టారు.
గ్రామ పటం, వనరుల పటం, సమస్యల ప్రాధాన్యత పట్టిక వంటి పద్ధతుల ద్వారా గ్రామ పరిస్థితులను అంచనా వేశారు.విద్యార్థులు లోకేష్, అభిరామ్, జ్ఞానేశ్వర్, హర్షిత్ రావు రైతులతో కలిసి కార్యక్రమాన్ని నిర్వహించి, వ్యవసాయ సమస్యలను గుర్తించే విధానాలను వివరించారు. రైతుల భాగస్వామ్యంతో సమస్యలను గుర్తించి, పరిష్కార మార్గాలను అన్వేషించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ ఆర్. సాయి కుమార్, వ్యవసాయ అధికారి దుర్గరాజు, వ్యవసాయ విస్తరణ అధికారి శారద, పంచాయతీ కార్యదర్శి, గ్రామ రైతులు పాల్గొన్నారు. విద్యార్థులు గ్రామస్థాయిలో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని రైతులు, అధికారులు అభినందించారు.






