calender_icon.png 6 February, 2026 | 12:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజాధనంతో వ్యక్తిగత కోరికలా?

20-01-2026 12:37:31 AM

  1. నాయకత్వం వారం రోజుల కోర్సుతో రాదు
  2. వ్యక్తిగత ప్రచారంపైనే సీఎం రేవంత్ దృష్టి
  3. బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి ఎన్‌వీ సుభాష్

హైదరాబాద్, జనవరి 19 (విజయక్రాంతి): ప్రజల సొమ్ముతో సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిగత కోరికలు తీర్చుకుంటున్నారని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి- ఎన్‌వీ.సుభాష్ విమర్శించారు. ‘21వ శతాబ్దం నాయకత్వం’ కోర్సులో పాల్గొనడానికి అమెరికాలో హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్తున్నారని, అయితే, ఇలా రేవంత్ రెడ్డి తన వ్యక్తిగత కోరికలు తీర్చుకునేందుకు ప్రజల సొమ్మును వినియోగించడంపై బీజేపీ తెలంగాణ రాష్ట్రశాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోందని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సుకోసం దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం హాజరైన తర్వాత నేరుగా అమెరికాకు వెళ్తున్నారన్నారు.

నాయకత్వం వారం రోజుల కోర్సు లేదా సర్టిఫికెట్‌తో రాదని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం, సుపరిపాలనతో వ్యవహరించడం, జవాబుదారీతనాన్ని చూపడం.. ఇవే నిజమైన నాయకత్వమని పేర్కొన్నారు. ఇటీవల ఫుట్‌బాల్ ఆడాలన్న వ్యక్తిగత కోరికను ప్రభుత్వ కార్యక్రమంగా చూపించడం, ఇప్పుడు చదువు పేరుతో విదేశీ పర్యటనలు చేయడం ఇవన్నీ పాలనపై కాకుండా ముఖ్యమంత్రి వ్యక్తిగత ప్రచారంపైనే ధ్యాస పెట్టినట్లుగా ఉన్నాయని ఆయన విమర్శించారు. రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు ఖర్చు చేసే డబ్బు, సమయం రైతుల సమస్యలు, యువతకు ఉద్యోగ అవకాశాలు, మౌలిక వసతుల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు కోసం ఉపయోగిస్తే తెలంగాణ ప్రజలకు నిజమైన మేలు జరిగేదని తెలిపారు.