22-04-2025 03:26:19 PM
న్యూఢిల్లీ: సివిల్ సర్వీసెస్ పరీక్ష ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) మంగళవారం విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఉన్న మొత్తం 1056 ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి పోస్టుల భర్తీకి గతేడాది ఫిబ్రవరిలో యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. జూన్ 16వ తేదీన నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన వారికి సెప్టెంబర్ 20 నుంచి 29వ తేదీ వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించింది.
మెయిన్స్ లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఈ ఏడాది జనవరి 7 నుంచి ఏప్రిల్ 17వ తేదీ వరకు దశల వారీగా పర్సనాలిటీ టెస్ట్ ఇంటర్వ్యూలు నిర్వహించారు. అందుకు సంబంధించిన తుది ఫలితాలను ఇవాళ యూపీఎస్సీ ప్రకటించింది. ఈ ఫలితాల్లో మొత్తం 1009 మంది అభ్యర్థులను కమిషన్ ఎంపిక చేయగా.. జనరల్ కేటగిరిలో 335 మంది, ఈడబ్ల్యూఎస్ కేటగిరిలో 109 మంది, ఓబీసీ కేటగిరిలో 318 మంది, ఎస్సీ కేటగిరిలో 160 మంది, ఎస్టీ కేటగిరిలో 87 మంది చొప్పున ఉన్నారు.
టాప్ 10 ర్యాంకర్లు వీరే...
సివిల్స్ లో శక్తి దూబేకు మొదటి ర్యాంక్, హర్సిత గోయల్ కు రెండో ర్యాంక్, అర్చిత్ పరాగ్ కు మూడో ర్యాంక్, షా మార్గి చిరాగ్(4), ఆకాశ్ గార్గ్ (5), కోమల్ పునియా(6), ఆయుషీ బన్సల్(7), రాజ్కృష్ణ ఝా(8), ఆదిత్య విక్రమ్ అగర్వాల్ (9), మయాంక్ త్రిపాఠి(10) ర్యాంకుల్లో మెరిశారు.
సివిల్స్ లో మెరిసిన తెలుగు తేజాలు వీరే..
సివిల్స్ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల నుంచి సత్తా చాటిన విద్యార్థుల్లో ఇ. సాయి శివాని 11వ ర్యాంకుతో మెరవగా.. బన్నా వెంకటేశ్కు 15వ ర్యాంకు, అభిషేక్ శర్మ 38, రావుల జయసింహారెడ్డి 46, శ్రవణ్కుమార్ రెడ్డి 62, సాయి చైతన్య జాదవ్ 68, ఎన్ చేతన రెడ్డి 110, చెన్నంరెడ్డి శివగణేష్ రెడ్డి 119, చల్లా పవన్ కల్యాణ్ 146, ఎన్. శ్రీకాంత్ రెడ్డి 151, నెల్లూరు సాయితేజ 154, కొలిపాక శ్రీకృష్ణసాయి 190వ ర్యాంకులతో అదరగొట్టారు.