21 July, 2026 | 5:32 PM

నీట్ వ్యవహారంలో 13 మందిని జైలుకు పంపాం: కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు

21-07-2026 12:02 PM

నీట్ పరీక్షల్లో అక్రమాలపై చర్యలు తీసుకున్నాం

ఢిల్లీ: 'మంగళ్ మిలన్' పేరుతో( NDA Mangal Milan meeting) ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ భేటీ అయింది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు(Union Minister Kiren Rijiju) మాట్లాడుతూ, నీట్ (NEET) పరీక్షకు సంబంధించి అక్రమాలు జరిగినట్లు నివేదికలు అందగానే కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి, 13 మందిని అరెస్టు చేసి జైలుకు పంపిందని తెలిపారు. అంతేకాకుండా, విద్యార్థుల భవిష్యత్తుకు ప్రాధాన్యతనిస్తూ ఎటువంటి జాప్యం లేకుండా రీ- ఎగ్జామ్ నిర్వహించి, ఫలితాలను కూడా ప్రకటించామని పేర్కొన్నారు. భవిష్యత్తులో పేపర్ లీక్ వంటి ఘటనలు జరగకుండా తీసుకుంటున్న కఠిన చర్యల గురించి కూడా రిజిజు హామీ ఇచ్చారు. తప్పు చేసిన వారిని శిక్షించడం, ఎటువంటి లోపాలు లేని వ్యవస్థను రూపొందించే దిశగా కేంద్రం పనిచేస్తోందని వెల్లడించారు. 

భవిష్యత్తులో ప్రశ్నపత్రాల లీకేజీలను నివారించే విషయంలో దేశ యువతకు పూర్తి భరోసా కల్పించడమే కాకుండా, ప్రపంచ వేదికపై భారతీయ యువత నాయకత్వ పాత్ర పోషించేలా వారికి మార్గాలను చూపడంపై కూడా ప్రధాన మంత్రి మోదీ నొక్కి చెప్పారని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. అంతేకాకుండా, ప్రస్తుతం జరుగుతున్న వర్షాకాల సమావేశాల్లో ఎన్‌డీఏ (NDA) నిర్మాణాత్మక పాత్ర పోషిస్తుందన్నారు. దేశ ప్రయోజనాల కోసం ప్రవేశపెట్టే బిల్లులు, శాసనపరమైన అంశాలను ఆమోదించాలనే విషయంలో తాము ఏకతాటిపై ఉన్నామని స్పష్టం చేశారు. వివిధ పార్టీలకు భిన్నమైన అభిప్రాయాలు ఉండవచ్చన్న కిరణ్ రిజిజు దేశం, దాని భవిష్యత్తు, యువత కోసం కలిసి పనిచేయాలని ప్రతిపక్షాలకు పిలుపునిచ్చారు.