ఇద్దరు విలేకర్లు అరెస్ట్
అశ్వారావుపేట,(విజయక్రాంతి): అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో రైతును మీడియా పేరుతో బెదిరించి రూ.5,000/- బలవంతంగా లాక్కున్న ఘటనలో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు అశ్వారావుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజు తెలిపారు. శుక్రవారం సర్కిల్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
దమ్నపేట కు చెందిన పండు కిరణ్, సయ్యద్ జానీ అహ్మద్ అనే వ్యక్తులు ఈ నెల 24 వ తేదీ తెల్లవారుజాము సమయంలో రామచంద్రాపురం క్రాస్ రోడ్ సమీపంలో పొగాకు లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ను నిందితులు అడ్డగించి, తాము మీడియా ప్రతినిధులమని చెప్పి డ్రైవర్ ను బెదిరించి డబ్బులు డిమాండ్ చేశారని సి ఐ తెలిపారు. ట్రాక్టర్ డ్రైవర్ డెయిల్ 112కు ఫోన్ చేయడానికి ప్రయత్నించగా, అతని సెల్ ఫోన్ లాక్కునే ప్రయత్నంలో తోపులాట జరిగిందని తెలిపారు.
అనంతరం డ్రైవర్ ను చంపుతామని బెదిరించి అతని వద్ద ఉన్న రూ.5,000/-నగదును బలవంతంగా లాక్కొని అక్కడి నుంచి పరార్ అయినట్టు సి ఐ తెలిపారు. డ్రైవర్ పిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో నిందితుల వద్ద నుంచి రూ.1,000/- నగదు, టి మీడియా ప్రెస్ ఐడి కార్డు మరియు నేరానికి ఉపయోగించిన ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. మీడియా గుర్తింపు కార్డులను దుర్వినియోగం చేస్తూ బెదిరింపులు, అక్రమ వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సి ఐ హెచ్చరించారు.






