ఓటరు జాబితా గణనపై ఎన్యూమరేటర్లకు శిక్షణ
నూతనకల్, ఏప్రిల్ 21: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు ఓటరు జాబితా గణనపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఓటరు గణన ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని ఆదేశించారు.
జనవరి 2026 నాటికి ఓటరు జాబితాలో ఉన్న ప్రతి ఓటరు వివరాలను బి.ఎల్.ఓలు ఇంటింటికి వెళ్లి సేకరించాలని సూచించారు.ప్రతి ఓటరును వ్యక్తిగతంగా కలిసి ఎన్యుమరేషన్ ఫారాన్ని తప్పనిసరిగా నింపాలని, పాత ఓటర్లతో పాటు కొత్త ఓటర్ల వివరాలను కూడా నమోదు చేయాలని తెలిపారు. ఒకవేళ ఎన్యుమరేషన్ ఫారంలో ఓటరు పేరు నమోదు చేయకుంటే, రానున్న కాలంలో ప్రకటించే జాబితా నుండి వారి పేర్లు తొలగించబడతాయని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు, రెవెన్యూ సిబ్బంది మరియు ఎన్యుమరేటర్లు పాల్గొన్నారు.






