నివాస భవనంలో అగ్నిప్రమాదం: ముగ్గురు మృతి, ఇద్దరికి గాయాలు
గోవింద్పురిలోని నివాస భవనంలో అగ్నిప్రమాదం
ముగ్గురు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు
న్యూఢిల్లీ: ఆగ్నేయ ఢిల్లీలోని గోవింద్పురి(Govindpuri) ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున ఐదు అంతస్తుల నివాస భవనంలో అగ్నిప్రమాదం(Fire Accident) సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. పోలీసుల సమాచారం ప్రకారం, తెల్లవారుజామున సుమారు 2:31 గంటలకు గోవింద్పురి పోలీస్ స్టేషన్కు(Govindpuri Police Station) అగ్నిప్రమాదానికి సంబంధించిన PCR కాల్ వచ్చింది. తుగ్లకాబాద్ ఎక్స్టెన్షన్లోని ఒక నివాస భవనంలో అగ్నిప్రమాదం సంభవించింది. హూటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఢిల్లీ అగ్నిమాపక సిబ్బంది భవనం పైకప్పుపైకి ఎక్కి, అక్కడి గేటు తాళాన్ని కత్తిరించి లోపలికి ప్రవేశించారు. పైకప్పుపై చిక్కుకుపోయిన ఇద్దరు బాలికలను రక్షించి ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. ప్రాథమిక విచారణ ప్రకారం, కింది అంతస్తులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉండవచ్చని తెలుస్తోంది. ఈ భారీ మంటల్లో పార్క్ చేసి ఉన్న ఏడు ద్విచక్ర వాహనాలను, ఛార్జింగ్ అవుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్తో సహా వాహనాలన్నీ దగ్ధమయ్యాయి. ఢిల్లీలోని మాలవీయ నగర్లో ఉన్న ఒక రెస్టారెంట్లో సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో విదేశీయులతో సహా కనీసం 21 మంది మరణించిన పది రోజుల లోపే ఈ ఘటన చోటుచేసుకుందని అధికారులు తెలిపారు.






