ముంబైలో ఘోర అగ్నిప్రమాదం— సిలిండర్ పేలుళ్లతో తీవ్ర భయాందోళన
థానే: మహారాష్ట్ర థానే జిల్లా(Thane district) మీరా భయందర్ మురికివాడలో సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించారని, ఈ ప్రమాదం కారణంగా పలు ఎల్పిజి (LPG) సిలిండర్లు పేలిపోయాయని ఒక పౌర అధికారి శనివారం తెలిపారు. మీరా భయందర్ మున్సిపల్ కార్పొరేషన్ (Mira-Bhayandar Municipal Corporation) ప్రధాన అగ్నిమాపక అధికారి ప్రకాష్ బోరాడే మీడియాతో మాట్లాడుతూ, శుక్రవారం రాత్రి సుమారు 8:30 గంటలకు మీరా భయందర్లోని నవ్ఘర్ ప్రాంతంలో ఉన్న ఇంద్రలోక్ మురికివాడ కాలనీలో అగ్నిప్రమాదం సంభవించిందని తెలిపారు. గడ్డి, వస్త్రాలతో నిర్మించిన తాత్కాలిక గుడిసెల దట్టమైన సమూహం గుండా మంటలు వేగంగా వ్యాపించడంతో, సుదూరం నుంచే అగ్నిజ్వాలలు కనిపించాయని చెప్పారు. ఈ విషాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.




