30 రోజులు వీసా ఫ్రీ
- భారత పౌరులకు ఉజ్బెకిస్థాన్ ఆఫర్
- ఆ దేశాధ్యక్షుడు మిర్టియోయెవ్ కానుక
- ప్రధాని మోదీతో ద్వైపాక్షిక భేటీ
- కీలక ఒప్పందాలపై సంతకాలు
- 2030 నాటికి 5 బిలియన్ డాలర్ల వాణిజ్యమే లక్ష్యం
తాష్కెంట్, ఆగస్టు ౩౦: భారతీయ పౌరుల కోసం ఉజ్బెకిస్థాన్ నెలపాటు (30 రోజులు) వీసా రహిత విధానాన్ని ప్రకటించింది. తద్వారా ఇరు దేశాల మధ్య వాణిజ్య, పర్యాటక సంబంధాలు బలపడతాయని ఆకాంక్షించింది. మధ్య ఆసియా పర్యటనలో భాగంగా శనివారం భారత ప్రధాని మోదీ తాష్కెంట్లో ఆ దేశాధ్యక్షుడు షవ్కత్ మిర్జియోయెవ్తో భేటీ అయ్యారు. ఇరు దేశాధినేతలు ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలపై సుదీర్ఘంగా చర్చించారు.
పెట్టుబడులు, ఆవిష్కరణలు, రక్షణ వంటి అంశాలపై ప్రధానంగా చర్చించారు. పరస్పరం దీర్ఘకాలిక యురేని యం సరఫరా ఒప్పందం కుదుర్చు కున్నారు. ఒప్పందం ద్వారా భారత్ అణు శక్తి ప్రణాళికలు మరింత బలపడనున్నాయి. భవిష్యత్తులో ఇంధన భద్రతకు ఒప్పందం ఎంతగానో దోహదపడుతుంది. ఇరు దేశాల మధ్య వాణిజ్యం గతేడాది ౧౦౦ కోట్ల డాలర్లు దాటింది. చరిత్రలో ఈ మైలురాయిని చేరుకోవడం ఇదే తొలిసారి.
వాణిజ్య సంబంధాలను మరింత విస్తరించుకుని 2030 నాటికి 5 బిలియన్ డాలర్ల వాణిజ్యాన్ని అధిగమించాలనే లక్ష్యంతో ఇరు దేశాలు ముందుకు వెళ్లనున్నాయి. మరోవైపు, పట్టణాభివృద్ధి రంగంలో గుజరాత్ గిఫ్ట్ సిటీ నమూనాను అధ్యయనం చేసేందుకు ఉజ్బెకిస్థాన్ ప్రతినిధులు సిద్ధమయ్యారు.
భేటీ అనంతరం మోదీ ఉజ్బెకిస్థాన్ విదేశీ ప్రతినిధులకు అందించే ‘ఒలియ్ దరాజాలి దోస్త్లిక్’ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ పర్యటన ముగిసిన తరువాత మోదీ కిర్గిజిస్తాన్ చేరుకున్నారు. ఆదివారం బిష్కెక్ నగరంలో జరుగనున్న ఎస్సీఓ సదస్సుకు ప్రాతినిధ్యం వహించనున్నారు.






