భూపాలపల్లి జిల్లా కేంద్రంలో దొంగల చేతివాటం
- రాఖీ పండుగకు వెళ్లిన ఇంట్లో చోరీ
- బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదు ఎత్తుకెళ్లిన దొంగలు
భూపాలపల్లి టౌన్, ఆగస్టు 30 (విజయక్రాంతి) : రాఖీ పండుగకు ఊరికి వెళ్లిన ఇంటిలో చోరి జరిగిన ఘటన భూపాలపల్లి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక సుభాష్ కాలనీలో నివాసం ఉంటున్న పుల్ల సృజన్ కుటుంబం రాఖీ పండుగకు ఊరికి వెళ్లారు.
ఈ క్రమంలో ఇంట్లో నుండి కోతులు బయటకు వస్తున్న విషయాన్ని గమనించిన పక్కింటి వారు అనుమానంతో ఫోన్ సదరు కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా వారు వచ్చి చూసే సరికి ఇంటి తాళం పగలకొట్టి బీరువా తలుపులు తెరిచి ఉండడం గమనించారు. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు బీరువాలో ఉన్న బ్యాగును దొంగలు ఎత్తుకెళ్లినట్లు తెలిపారు.
ఆ బ్యాగులో సుమారు 4 నుండి 5 తులాల బంగారం, 20 తులాల వెండి పట్టీలతో పాటు 4 నుండి 5 వేల రూపాయలు నగదు ఉన్నట్లు కన్నీరు పెట్టుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.






