8 March, 2026 | 2:26 AM

లొంగేది లేదు

08-03-2026 12:58 AM
  1. అమెరికా- ఒత్తిళ్లకు తలవంచబోం
  2. ఇరాన్ లొంగిపోవాలనే శత్రువుల కల నెరవేరదు
  3. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు ఇరాన్ అధ్యక్షుడు కౌంటర్
  4. మా దేశాన్ని కాపాడుకుంటాం: పెజెష్కియాన్
  5. పొరుగుదేశాలపై దాడులకు క్షమాపణ

టెహ్రాన్, మార్చి 7: అమెరికా- ఒత్తిళ్లకు తలవంచే ప్రసక్తే లేదని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ శనివారం స్పష్టంచేశారు. ఇరాన్ ప్రజలు ఎన్నడూ లొంగిపోరని, ఇరాన్‌ను లొంగదీసుకోవచ్చని అనుకునే వాళ్లు ఎప్పటికీ విజయం సాధించాలేరని, ఎట్టిపరిస్థితుల్లో తమ దేశాన్ని తామే కాపాడుకుంటామని ఇరాన్ స్టేట్ టీవీ ప్రసారం చేసిన ప్రసంగంలో పెజెష్కియాన్ చెప్పారు. పొరుగుదేశాలపై తమ దాడు లపై ఆయన క్షమాపణ చెప్పారు.

‘ఇరాన్ జరిపిన దాడులకు పొరుగు దేశాలకు వ్యక్తిగతంగా, ఇరాన్ తరఫున క్షమాపణలు తెలియజేసుకుంటున్నాను’ అని ఆయన పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఇరాన్  లొంగిపోవాలని చేసి న వ్యాఖ్యలపై పెజెష్కియాన్ పరోక్షంగా స్పందిస్తూ.. ఇరాన్ ప్రజలు లొంగిపోవాలనే శత్రువుల కోరికలు వారు చచ్చి, స్మశానికి వెళ్లినా నెరవేరవని ఇరాన్ అధ్యక్షుడు అన్నారు. ఇరాన్ తన పొరుగు దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవిస్తుందని, ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ మధ్య ప్రాచ్యంలో మళ్లీ ప్రశాంత పరిస్థితులకు ఇరాన్ కృషి చేస్తున్నదని తెలిపారు.

అమెరికా దళాలున్న కువైట్, ఖతార్, సౌదీ అరేబియా, బహ్రెయిన్‌లను ఇరాన్ లక్ష్యంగా చేసుకున్న విషయం తెలిసిందే. కాగా, పొరుగుదేశాలలో దాడి చేయమని ఇరాన్ అధ్యక్షుడు ప్రకటించినప్పటికీ గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. దుబాయ్, అబుదాబి వంటి ప్రధాన నగరాల్లో పేలుళ్లు వినిపిస్తున్నాయి. క్షిపణులు, డ్రోన్లను ఎయిర్ డిఫెన్స్ సిస్టంలు అడ్డుకుంటున్న శబ్దాలు వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారు జామున ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్‌లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. విమానాశ్రయం సమీపంలో పెద్ద శబ్దం వినిపించడంతో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆపరేషన్లను శనివారం నిలిపివేశారు. ఇది చిన్న ఘటనేనని, అయితే ప్రయాణికుల భద్రత రీత్యా విమాన సర్వీసులను రద్దు చేశామని అధికారులు తెలిపారు.

అమెరికా ఇరాన్ దాడుల వల్ల గల్ఫ్ వ్యాప్తంగా ఎయిర్ ట్రావెల్‌కు అంతరాయం కలగడంతో వేలాది విమానాలు రద్దవుతున్నాయి. క్షిపణులు, డ్రోన్ దాడుల భయంలో పలు దేశాలు తమ గగనతలాన్ని మూసివేశాయి. అమెరికా, ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న దాడులతో తాము ౧,౩౩౨ పౌరులను కొల్పోయామని శనివారం ఇరాన్ ప్రకటించింది.