15 April, 2026 | 2:58 AM

ప్రభుత్వంపై ఎలాంటి వ్యతిరేకం లేదు

15-04-2026 12:13 AM
  1. కొందరు పెద్దలు మంత్రులు ఫోను లేపనందున బాధ కలిగింది
  2. బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాపత్రయం
  3. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రూ. 200 కోట్లు మంజూరు
  4. స్పష్టం చేసిన ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం

బాన్సువాడ,ఏప్రిల్ 14 (విజయ క్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డి మంత్రులపై ఎలాంటి వ్యతిరేకం గాని అసహనం కానీ లేదని, ప్రభుత్వంలోని కొందరు పెద్దలకు, మంత్రులకు అనేకసార్లు ఫోన్ చేసినా లేపనందున  బాధ కలిగిందని, అంతకుమించి ఏమీ లేదని ప్రభుత్వ సలహాదారులు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం అంబేద్కర్ జయంతి సందర్భంగా కామారెడ్డి జిల్లా బాన్సువాడ లో జరిగిన సభలో మాట్లాడుతూ తాను ఎందుకు బాధపడ్డానో వివరించారు.

తాను కూడా మంత్రిగా పనిచేశానని, అర్ధరాత్రి ఎవరు ఫోన్ చేసినా, ఫోన్ లేపే వాడినని, కానీ ప్రస్తుతం కొందరు స్పందించకపోవడంతో తాను బాధపడ్డానని పేర్కొన్నారు. తాను ఎల్లప్పుడూ బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధి కోసమే ఆలోచిస్తానని, అభివృద్ధి చేయాలని తాపత్రయమే తప్ప ఏమీ లేదన్నారు.తనతోపాటు అధికారులు, కలెక్టర్లు, మంత్రులు, ముఖ్యమంత్రి సహకారం అవసరం ఉందని ఆయన తెలిపారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో బాన్సువాడ నియోజకవర్గంలో రూ. 200 కోట్లతో పోతంగల్ శివారులో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మిస్తున్నామని వెల్లడించారు. 25 ఎకరాల స్థలంలో మూడు వేల విద్యార్థుల కోసం నిర్మిస్తున్న ఈ విద్యా సంస్థలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులు 5వ తరగతి నుంచి డిగ్రీ వరకు నాణ్యమైన విద్యను అభ్యసించడానికి వీలుంటుందని పేర్కొన్నారు. తాను నియోజకవర్గ అభివృద్ధి తప్ప వేరేది ఏమీ కోరుకోనని మరోసారి పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. కాగా ఎమ్మెల్యే స్పష్టికరనతో పార్టీ మారుతారనే వార్తలు, ఊహగనాలకు బ్రేక్ పడినట్లు అయింది.