ఓటరు జాబితా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
తహసీల్దార్ సంగ్రామ్ రెడ్డి
నాగల్గిద్ద, జూన్ 29: సంగారెడ్డి జిల్లా నాగల్గిద్ద మండలంలోని పలు గ్రామాల్లో కొనసాగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని తహసీల్దార్ సంగ్రామ్ రెడ్డి సోమవారం పరిశీలించారు. గ్రామాల్లో పర్యటిస్తూ ఎన్నికల ఎన్యూమరేటర్లు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను సేకరిస్తున్న తీరును పరిశీలించి వారికి పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హత కలిగిన ఓటరు తన పేరు ఓటరు జాబితాలో ఉందో లేదో తప్పనిసరిగా పరిశీలించుకోవాలని తెలిపారు. మండలంలోని పలు గ్రామాల్లో ఎన్యూమరేటర్లు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను ధృవీకరిస్తూ అవసరమైన ఫారాలను పంపిణీ చేస్తున్నారని తెలిపారు. ప్రతి అర్హుడైన ఓటరు వివరాలు నమోదు అయ్యేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తహసీల్దార్ సంగ్రామ్ రెడ్డి సూచించారు. వారితో పాటు జిపిఓ సునీత, బిఎల్ఓ నిర్మల తదితరులు ఉన్నారు.






