పుష్కరాలకు వచ్చే భక్తులకు సౌకర్యాల కల్పనే లక్ష్యం
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
ధర్మపురి, జూన్ 30 (విజయక్రాంతి): 2027లో జరిగే గోదావరి పుష్కరాలు వచ్చే భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నమని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
పుష్కరాలకు వచ్చే భక్తుల కోరకు తీసుకోవాల్సిన చర్యలపై మంగళవారం ప్రైవేట్ కన్సల్టెన్సీ ప్రతినిధులతో గోదావరి తీరంలో మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మాట్లాడుతూ 2027లో నిర్వహించే గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని మంత్రి తెలిపారు. బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి తీరంలో ఆలయాల అభివృద్ధి మౌలిక సదుపాయాల కల్పనకు ఇప్పటికి ప్రభుత్వం రూ. వెయ్యి కోట్లు కేటాయించిందని మంత్రి తెలిపారు.
ఇందులో ధర్మపురి నియోజకవర్గానికి రూ. 117 కోట్లు కేటాయించినట్లు మంత్రి వివరించారు.ధర్మపురి క్షేత్రానికి పుష్కర స్నానాలు ఆచరించే భక్తులకు ఏలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.
పుష్కరాలకు వచ్చే భక్తుల కొరకు తాగునీటి సౌకర్యం, డ్రెస్సింగ్ రూమ్స్, మరుగుదొడ్ల సౌకర్యం, పారిశుద్ధ్య పనుల నిర్వహణ కొరకు గత గోదావరి పుష్కరాలకు, కృష్ణ పుష్కరాలకు పనులు చేసిన ప్రతినిధులతో కలిసి ఈరోజు పరిశీలించినట్లు మంత్రి తెలిపారు.మంత్రి వెంట జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంగనభట్ల దినేష్ తోపాటు వేముల రాజు ధర్మపురి మున్సిపల్ వైస్ చైర్మన్ రామన్న, వార్డు కౌన్సిలర్లు చీపిరిశేట్టి రాజేష్, అయ్యోరి గోపాల్, పవన్, ప్రశాంత్, వోజ్జల లక్ష్మణ్ లతో పాటు జక్కు రవీందర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.






