పేదల ఇళ్ల కూల్చివేత దారుణం
- ఫూలే జయంతి రోజున బలహీనుల ఇళ్లు నేలమట్టం
ఇదేనా కాంగ్రెస్ ప్రజాపాలన? : మాజీ మంత్రి హరీశ్రావు
హైదరాబాద్, ఏప్రిల్ 11 (విజయక్రాంతి): ఫూలే జయంతి వంటి మహానుభావుని స్మరణ దినాన, బడుగుబలహీన వర్గాల ఇళ్లను కూల్చివేయడం అత్యంత దారుణమని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శిం చారు. సమానత్వం, సామాజిక న్యాయం కోసం జీవితాన్ని అంకితం చేసిన జ్యోతిరావు ఫూలే ఆత్మను అవమానించే చర్య ఇది అని మండిపడ్డారు. ఈ మేరకు హరీశ్రావు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ప్రజాపాలన పేరుతో పేదల ఇళ్లను కూల్చడం, మహిళలు, చిన్నారులను నడిరోడ్డు మీద నిలబెట్టడం.. ఇదేనా కాంగ్రెస్ చేసే ప్రజాపాలన? అని ప్రశ్నించారు.
ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చి, బడుగు బలహీన వర్గాలపై దాడులు జరపడం, వారికి నిలువ నీడ లేకుండా చేయడం ప్రజాస్వామ్యానికే మచ్చ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమం బలహీన వర్గాల గౌరవం, హక్కు ల కోసం సాగిందని అన్నారు. భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వం, భ యం నింపే ప్రభుత్వంగా మారిందని మండిపడ్డారు. రాహుల్ గాంధీ రాజ్యాంగ పరిరక్షణ అని మాట్లాడుతుంటే, వారి సీఎం ఆచరణలో మాత్రం రాజ్యాంగ భక్షణ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాజ్యాంగం చేతిలో పట్టుకోవడం కాదు రాహుల్ గాంధీ,
దాని విలువలను ప్రజల జీవితాల్లో అమలు చేయ డం ముఖ్యమని హితవు పలికారు. పేదల ఇళ్లను శని, ఆదివారాల్లో కూల్చడం, రాజ్యాంగ ఆత్మకు తూట్లు పొడిచినట్లు కాదా మిస్టర్ రాహుల్ గాంధీ అని ప్రశ్నించారు. ఈ అమానుష చర్యలను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని, బాధితులకు తక్షణ న్యాయం, పునరావాసం కల్పించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు.




