హాస్టల్ను తనిఖీ చేసిన కలెక్టర్
హనుమకొండ, మే 11 (విజయక్రాంతి): విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న వసతి, ఆహార సదుపాయాలు నాణ్యతతో ఉండాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయి ఆదేశించారు. సోమవారం హనుమకొండ సుబేదారిలోని గిరిజన సంక్షేమ శాఖ పోస్ట్ మెట్రిక్ బాలుర కళాశాల వసతి గృహాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా హాస్టల్లోని కిచెన్ షెడ్, ఆర్వో వాటర్ ప్లాంట్, టాయిలెట్లు, డార్మెటరీలను పరిశీలించి, నిర్వహణపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం స్టోర్రూమ్లో నిల్వ ఉంచిన కూరగాయలు, పప్పులు, బియ్యం తదితర ఆహార పదార్థాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించిన కలెక్టర్, స్టోర్లో ఉన్న నిల్వలు, రికార్డుల్లో నమోదైన వివరాల మధ్య వ్యత్యాసాలు ఉన్నట్లు గుర్తించారు.
అలాగే పప్పు దినుసులు, ఇతర ఆహార పదార్థాల నిర్వహణ సరిగా లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సంబంధిత వార్డెన్ హాల్ సింగ్కు నోటీసు జారీ చేయాలని డీటీడీవో ప్రేమకళను ఆదేశించారు. హాస్టల్లో నివసిస్తున్న విద్యార్థులతో కలెక్టర్ ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ఏ కళాశాలలో చదువుతున్నారు, భోజనం, స్నాక్స్ సమయానికి అందుతున్నాయా, ఆహార నాణ్యత ఎలా ఉందనే అంశాలపై ఆరా తీశారు.
అదేవిధంగా వారానికి ఎన్నిసార్లు చికెన్, మటన్, గుడ్లు అందిస్తున్నారో వార్డెన్ను అడిగి తెలుసుకున్నారు.హాస్టల్ పరిసరాలను పరిశీలించిన కలెక్టర్, విద్యార్థులకు మెరుగైన వసతి, పరిశుభ్రమైన వాతావరణం, నాణ్యమైన ఆహారం అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని అధికారులకు అన్నారు. విద్యార్థుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.






