ఆగిపోయిన ఆర్టీసీ రథచక్రం
- డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు.
- డిపో గేట్ల ముందు బైఠాయించి కార్మికుల ధర్నా.
- డిమాండ్ల సాధన కోసం మొదలైన ఉద్యమం.
- తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రయాణికులు.
- అవకాశాన్ని క్యాష్ చేసుకుంటున్న ప్రైవేటు వాహనదారులు.
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా జేఏసీ పిలుపు మేరకు ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ప్రభావం నాగర్ కర్నూల్ జిల్లాలో(Nagarkurnool District) స్పష్టంగా కనిపిస్తోంది. జిల్లా పరిధిలోని అచ్చంపేట, కొల్లాపూర్, కల్వకుర్తి, నాగర్ కర్నూల్ డిపోలలో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. కండక్టర్, డ్రైవర్ కార్మికులు డిపోల ముందు బైఠాయించి ధర్నాలు నిర్వహిస్తూ తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యమం కొనసాగిస్తున్నారు.
దీంతో జిల్లాలోని అనేక మార్గాల్లో బస్సు సర్వీసులు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగులు, విద్యార్థులు, అత్యవసర పనుల కోసం ప్రయాణించే సామాన్యులు, దినసరి కూలీలు, ఇబ్బందులకు గురవుతున్నారు. ఆర్టీసీ అధికారులు(RTC Officials) ప్రత్యంనాయ ఏర్పాట్లు చేయకపోవడంతో ఇదే సమయంలో ప్రైవేటు వాహనదారులు పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకుంటూ అధిక చార్జీలు వసూలు చేస్తున్నట్లు ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమ్మె నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా డిపోలు, బస్ స్టేషన్ల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్మికుల డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని నాయకులు స్పష్టం చేశారు.






