కలెక్టరేట్ ముందు టీచర్ల భారీ నిరసన ప్రదర్శన
- విద్యా రంగ బడ్జెట్ ను సవరించి 20 శాతం వరకు పెంచాలి
- పెండింగ్లో ఉన్న విద్యారంగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
- టీపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నెబోయిన తిరుపతి
హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ హనుమకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ముందు విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోరుతూ వందలాదిమంది ఉపాధ్యాయులతో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ నిరసన ప్రదర్శనకు హాజరైన టిపిటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నెబోయిన తిరుపతి మాట్లాడుతూ... పాలకులు ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు, విద్యారంగానికి ప్రస్తుత బడ్జెట్లో కేటాయించిన 8.22 శాతం నుండి 20 శాతం వరకు పెంచి బడ్జెట్ ను సవరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కునారిల్లుతున్న ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడాలంటే, ప్రభుత్వ పాఠశాలలకు తరగతి గదుల నిర్మాణం, మౌలిక వసతుల కల్పన, కంప్యూటర్, గ్రంథాలయ నిర్మాణం, ఉపాధ్యాయుల నియామకం, పూర్వ ప్రాథమిక తరగతులను ప్రవేశపెట్టడం మొదలగునవి బడ్జెట్ పెంచడం వల్లనే సాధ్యమవుతుందన్నారు. గత పిఆర్సి గడువు 2023 జూలై తో ముగిసి 33 నెలలు కావస్తున్న, నేటి బడ్జెట్లో కొత్త పిఆర్సి ప్రస్తావన లేకపోవడం, బడ్జెట్లో కేటాయింపులు లేకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పిఆర్సి ని వెంటనే ప్రకటించాలి. పెండింగ్ లో ఉన్న ఐదు డిఏలకు ప్రస్తుత బడ్జెట్లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు బత్తిని శ్రీమాంజనేయులు, టీపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొడిశాల సత్యనారాయణ, రాష్ట్ర కౌన్సిలర్ ముత్యాల రఘుపతి, జిల్లా ఉపాధ్యక్షులు చంద్రగిరి లక్ష్మయ్య, కుమారస్వామి, సీహెచ్ రాజేంద్రం, వీరభద్రం, కార్యదర్శులు జి.రమేష్, అన్నారెడ్డి, అంకం శ్రీనివాస్, చక్రునాయక్, సత్తార్, సీనియర్ నాయకులు జి.నటరాజ్, పి.జయప్రకాష్, అంకతి సదానందం, సుదర్శన్, ఎస్.కుమారస్వామి, రాజేందర్, బి.సారయ్య, భాస్కర్, బిక్షపతి, శ్రీరామ్, కొమురయ్య, సారయ్య, చంద్రమౌళి, రాజు, మల్లేశం, రవీందర్, చందర్ నాయక్, సదానందం, వెంకటేశ్వర్లు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.




