గ్రామీణ రోడ్లకు భారీగా నిధులు
- బడ్జెట్లో రూ.33,688 కోట్లు కేటాయింపు
- ఈసారి రూ.2,083 కోట్లు అదనం
హైదరాబాద్, మార్చి 20 (విజయక్రాంతి): పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు ప్రభుత్వం ఈ బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించింది. 2026-27 వార్షిక బడ్జెట్లో రూ.33, 688 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. గత బడ్జెట్లో రూ.31,605 కోట్లు కేటాయించగా, ఈ బడ్జెట్లో అనదంగా రూ.2,083 కోట్లు కేటాయించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం రోడ్ల నిర్మాణాలకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముం దుకు వెళ్లుతోందని స్పష్టమవుతోంది.
రాష్ట్రంలోని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఎంపిక చేసిన రహదారులను హ్యామ్ (హైబ్రిడ్ అన్యుటి మూడ్) విధానంలో నిర్మాణం, అభివృద్ధి, నిర్వహణ చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. మొదటి దశలో 96 నియోజక వర్గాల పరిధిలో 7,450 కిలోమీటర్ల గ్రామీణ రోడ్లను నిర్మించనుంది.
ఈ విధానంలో 40 శాతం వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించగా, మిగిలిన 60 శాతం పెట్టుబడిదారు పెడుతారు. ఈ 60 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం 15 ఏళ్ల కాలపరిమితిలో యాన్యునిటిలలో తిరిగి చెల్లించనుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 2,980 కిలోమీటర్ల రహదారులను నిర్మించాలని ప్రతిపాదించగా, అందుకు రూ.1,372 కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వం భావిస్తోంది.
ఆర్అండ్బీకి రూ.12,789 కోట్లు
- గతేడాది రూ.10 వేల కోట్లపైనే
హైదరాబాద్, మార్చి 20 (విజయక్రాంతి): రవాణా, రోడ్లు భవనాల శాఖకు బడ్జెట్లో రూ.12,789 కోట్లు కేటాయించారు. అయితే గత బడ్జెట్ కంటే ఈ వార్షిక బడ్జెట్లో నిధులు కాస్త పెరిగాయి. 2025-26 బడ్జెట్లో రవాణా శాఖకు రూ.4,485 కోట్లు, రోడ్లు భవనాల శాఖకు రూ.5,907 కోట్లు కేటాయించగా, 2026-27 బడ్జెట్లో మాత్రం రోడ్లు భవనాల శాఖకు రూ.8,298 కోట్లు కేటాయించగా ఇందులో నిర్వహణ పద్దుకు రూ.1,967 కోట్లు, స్కీమ్స్కు రూ.6,330 కోట్లు కేటాయించారు.
రవాణా శాఖకు రూ.4,773 కోట్లు కేటాయించగా, ఇందులో నిర్వహణకు రూ.131 కోట్లు, స్కీమ్స్కు రూ.4,361 కోట్లు కేటాయించారు. మహాలక్ష్మీ(ఆర్టీసీ) స్కీమ్కు రూ.4,305 కోట్లను కేటాయించారు. మొత్తంగా రూ.12,789 కోట్లలోహ్యామ్ రోడ్లకు రూ.3,053 కోట్లు, రీజనల్ రింగ్ రోడ్డుకు రూ.1,525 కోట్లు, ఆర్అండ్బీ రోడ్ల మెయింటెనెన్స్కు రూ. 828 కోట్లు, నూతన రోడ్ల నిర్మాణానికి రూ. 450 కోట్లు, ఆర్ఓబీ, ఆర్యూబీల కోసం రూ.216 కోట్లు, భవనాల నిర్మాణానికి రూ.100 కోట్లు కేటాయించారు. ఇప్పటికే రాష్ట్రంలోని ఆర్అండ్బీ రోడ్లను హ్యామ్ (హైబ్రిడ్ అన్యూటీ మోడ్)విధానంలో అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.




