15 August, 2026 | 2:39 PM

ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు

15-08-2026 01:35 PM

త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి* 

ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు

నిజామాబాద్,ఆగస్టు 15 (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో శనివారం 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పండుగ వాతావరణంలో అట్టహాసంగా జరిగాయి.  ఈ వేడుకలకు జిల్లా యంత్రాంగం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించిన మీదట, పుర ప్రముఖులను, అధికార అనధికారులను కలిసి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా ప్రగతిని నివేదిస్తూ, ప్రజనుద్దేశించి ప్రసంగించారు.

వివిధ శాఖల ద్వారా అమలవుతున్న కార్యక్రమాలు, సాధించిన ప్రగతిని తెలిపేలా ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. వ్యవసాయ, ఉద్యానవన, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, డెయిరీ, పశు సంవర్ధక, అటవీ, విద్యా, వైద్యారోగ్య, మహిళా శిశు సంక్షేమం, మిషన్ భగీరథ, నీటి పారుదల, సమగ్ర శిక్ష అభియాన్ తదితర శాఖల ఫోటో ఎగ్జిబిషన్ స్టాల్స్ ను సందర్శించారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి, ఆర్టీసీ, విద్యుత్, పౌర సరఫరాలు, హౌసింగ్ తదితర శాఖల శకటాల ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు.  ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు బహూకరించారు. పతకాలు పొందిన పోలీసులకు మెడల్స్ బహూకరించారు. స్వాతంత్ర్య సమర యోధులను, వారి కుటుంబీకులను ఘనంగా సన్మానించారు. 

పంద్రాగస్టు వేడుక సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను అలరింపజేశాయి. ఎదనిండా దేశ భక్తిని నింపుకుని జాతీయ స్ఫూర్తి పెంపొందేలా ఆకట్టుకునే రీతిలో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించి ఆహుతుల మన్ననలు అందుకున్నారు. కంజర రెసిడెన్షియల్ బాలికల పాఠశాల, విశ్వ వికాస్ హైస్కూల్, నవీపేట్ బాలికల జెడ్పీ హైస్కూల్ విద్యార్థినులు, టైం స్కూల్ చిన్నారులు సాంస్కృతిక గేయాలపై చక్కటి అభినయం ప్రదర్శించారు. ఈ సందర్భంగా చిన్నారులను ముఖ్య అతిథి పి.సుదర్శన్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు.

 ఈ వేడుకల్లో ఎమ్మెల్యేలు ధన్ పాల్ సూర్యనారాయణ, ఆర్.భూపతి రెడ్డి, పైడి రాకేష్ రెడ్డి, నగర మేయర్ ఉమారాణి, రాష్ట్ర మైనార్టీ కమిషన్ చైర్మన్ తారిఖ్ అన్సారీ, పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, అదనపు కలెక్టర్ భుజంగరావు, డీఎఫ్ఓ ప్రశాంత్ బాజీరావు పాటిల్ రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, ట్రైనీ కలెక్టర్ సురేష్, అదనపు డీసీపీ శుభం నగ్రాలే, డీఆర్ఓ గీత, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్, ట్రైనీ ఆర్డీఓ సందీప్, అన్ని శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది, స్వాతంత్ర్య సమరయోధులు, ప్రజలు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.