15 August, 2026 | 3:15 PM

నగరపాలక సంస్థలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

15-08-2026 02:24 PM

ముకరంపుర, ఆగస్టు 15(విజయక్రాంతి): కరీంనగర్ నగర మేయర్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా నగర ప్రథమ పౌరుడి హోదాలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మేయర్ కొలగాని శ్రీనివాస్(Mayor Kolagani Srinivas) పాల్గొన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ  ప్రధాన కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు, సిబ్బందితో కలిసి స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ, “కరీంనగర్ నగర మేయర్‌గా తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం నాకు ఎంతో గర్వకారణం. స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను అర్పించిన మహనీయుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కరీంనగర్ నగర సమగ్ర అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తాం” అని తెలిపారు.

స్వాతంత్ర్యం సాధించి 100 సంవత్సరాలు పూర్తయ్యే 2047 నాటికి భారతదేశాన్ని ‘వికసిత భారత్’గా తీర్చిదిద్దాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్పంలో ప్రతి భారతీయుడు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, డిప్యూటీ మేయర్ వై సునీల్ రావు, కార్పొరేటర్లు, కో ఆప్షన్ మెంబర్లు, మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, మున్సిపల్ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు