వెంకటాపురం మండలంలో ప్రత్యేక ఓటర్ సవరణ
రెండు పోలింగ్ కేంద్రాల్లో 204 మందికి నోటీసులు
వెంకటాపురం (నూగూరు) ఆగస్టు 30 (విజయ క్రాంతి): భారత ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమంలో భాగంగా వెంకటాపురం మండలంలో అధికారులు వేగం పెంచారు. ఓటరు జాబితాలో డూప్లికేషన్, చిరునామా మార్పు, తప్పుడు నమోదు వంటి అనుమానిత కేసులను బూత్ లెవెల్ ఆఫీసర్ల (బిఎల్ఓ) ద్వారా గుర్తించి నోటీసులు జారీ చేశారు. ఇందులో భాగంగా పీఎస్ 30 ఒంటిమామిడి పరిధిలో 130 మంది ఓటర్లకు ఫారం-7 కింద నోటీసులు జారీ కాగా వీరికి వెంకటాపురం తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్, ఈఆర్వో ఆధ్వర్యంలో పరిశీలన నిర్వహించనున్నారు.
అదేవిధంగా పీఎస్ 48 రాచపల్లి పరిధిలో మరో 74 మంది ఓటర్లకు నోటీసులు జారీ కాగా వీరికి మండల ప్రజా పరిషత్ (ఎంపీడీవో) కార్యాలయంలో పరిశీలన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. హియరింగ్ కు వచ్చే ఓటర్లు ఓటరు గుర్తింపు కార్డు,ఆధార్ కార్డు, రేషన్ కార్డు లేదా చిరునామా నిరూపణ పత్రం తప్పనిసరిగా తీసుకురావాలని,నిర్ణీత తేదీలో హాజరు కాకపోతే ఓటు తొలగించబడే అవకాశం ఉందని, ఎవరూ నిర్లక్ష్యం చేయకుండా తమ ఓటు హక్కును కాపాడుకోవాలని వెంకటాపురం తహసీల్దార్ ఎం. వేణుగోపాల్ తెలిపారు.






