ప్రత్యేక ఓటరు జాబితా సవరణకు శ్రీకారం
జూన్ 25 నుంచి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్ )ప్రారంభం.
అధికారులు బిఎల్ఓ మరియు బిఎల్ఎ 2 లు సమన్వయంతో సహకరించాలని బిఎల్ఎ 2 ల ఇంచార్జ్ పల్లపు బుద్ధుడు సూచన.
చిట్యాల, జూన్ 25 (విజయ క్రాంతి ): తెలంగాణ రాష్ట్రంలో భారత ఎన్నికల సంఘం ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ - సర్ )ను జూన్ 25, 2026 నుంచి ప్రారంభించిందని బిఎల్ఎ 2 ల ఇంచార్జ్ పల్లపు బుద్ధుడు గురువారం తెలిపారు. అర్హులైన ప్రతి పౌరుడు ఓటరు జాబితాలో తమ వివరాలు సక్రమంగా నమోదు చేసుకునేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈ సవరణలో భాగంగా జూన్ 25 నుంచి జూలై 24, 2026 వరకు బూత్ లెవల్ అధికారులు ( బిఎల్ఓ) ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేయనున్నారని, ఓటర్లు తమ కుటుంబ సభ్యుల వివరాలను పరిశీలించి, అవసరమైన సమాచారం నమోదు చేసి ఫారాలను సమర్పించాల్సి ఉంటుందని అన్నారు.
ఫారంలో పేరు, పుట్టిన తేదీ, ఆధార్ నంబర్, ఫోన్ నంబర్, తల్లిదండ్రుల వివరాలు తదితర సమాచారాన్ని నమోదు చేయాల్సి ఉంటుందని, 2002 సంవత్సరం తర్వాత జన్మించిన ఓటర్లు తమ తల్లిదండ్రుల జననానికి సంబంధించిన వివరాలు కూడా అందించాల్సి ఉంటుందని బిఎల్ఎ 2 ల ఇంచార్జ్ పల్లపు బుద్ధుడు సూచించారు. అలాగే, ఓటర్లు తమ వివరాలను ఆన్లైన్లో కూడా నమోదు చేసుకునే అవకాశం కల్పించారని, ఇందుకోసం ఓటర్స్ .ఈసీఐ .గౌట్ .ఇన్ వెబ్సైట్ను సందర్శించి ఎన్యూమరేషన్ ఫారాన్ని డౌన్లోడ్ చేసుకుని పూర్తి చేసి అప్లోడ్ చేయవచ్చని తెలిపారు. ఓటు హక్కు ప్రతి పౌరుడి బాధ్యత అని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో తమ పేర్లు నమోదు చేసుకుని ప్రజాస్వామ్య బలోపేతానికి సహకరించాలని ఉరుమడ్ల, చిన్నకాపర్తి, తాళ్ల వెల్లంల, వేంబావి, బోయగుబ్బ, మోర్స్ గూడెం, మొగిలి దొరి వివిధ గ్రామాల బిఎల్ఏ 2 ఇంచార్జ్ గా పనిచేస్తున్న పల్లపు బుద్ధుడు పిలుపునిచ్చారు. సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1950ను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.






