20 March, 2026 | 3:40 AM

సోషల్ మీడియాలో ప్రచారం

20-03-2026 12:14 AM

వ్యక్తిపై కేసు నమోదు

సిద్దిపేట క్రైం, మార్చి 19 : మత సామరస్యానికి భంగం కలిగించేలా సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసిన వ్యక్తిపై సిద్దిపేట టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. సిద్దిపేటలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఎదురుగా  దరిపల్లి వెంకటయ్య అనే వ్యక్తి సొంత స్థలంలో ఒక పురాతన దర్గా ఉంది. పెద్దగుట్ట దర్గాకు గుర్తుగా వెంకటయ్య పూర్వీకులు దానిని నిర్మించారు.

కొంతకాలం క్రితం శిథిలావస్థకు చేరడంతో, యజమానులు దానికి మరమ్మతులు చేపట్టి పునర్నిర్మిస్తున్నారు. ఇదిలాఉండగా, సాజిద్ పూరాకు చెందిన జహంగీర్ అనే వ్యక్తి ఆ చిల్లా(దర్గా)ను కూలగొడుతున్నారంటూ తప్పుడు అర్థం వచ్చేలా వీడియో తీసి వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం చేశాడు.

ఈ తప్పుడు సమాచారం వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉండటంతో, సిద్ధిపేట టూటౌన్ పోలీసులు  స్పందించి సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎవరైనా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ, వర్గ విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఇన్స్పెక్టర్ ఉపేందర్ హెచ్చరించారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు.