6 July, 2026 | 9:55 PM

ప్రభుత్వ ధాన్యాన్ని దోచుకునే వారిపై ఉక్కుపాదం..

06-07-2026 09:14 PM

సీఎంఆర్ బియ్యం అక్రమ దారి మళ్లింపు నిందితుడిపై పీడీ యాక్ట్ అమలు

చట్టవ్యతిరేక కార్యకలా

పాలకు పాల్పడితే ఎవరినీ ఉపేక్షించం

పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

సుల్తానాబాద్,(విజయక్రాంతి): ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న ఆహార భద్రతా పథకాలకు భంగం కలిగిస్తూ, ప్రభుత్వ ధాన్యాన్ని అక్రమంగా దారి మళ్లించి ప్రజల హక్కులను హరిస్తున్న వారిపై రామగుండం పోలీస్ కమిషనరేట్ రాజీ లేని వైఖరిని అవలంబిస్తోంది. ప్రభుత్వానికి కోట్లాది రూపాయల నష్టం కలిగించడమే కాకుండా,ప్రజలకు అందాల్సిన నిత్యావసర ధాన్య సరఫరా వ్యవస్థను దెబ్బతీసే వ్యక్తులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోకరీంనగర్ జిల్లా కట్టరాంపూర్‌కు చెందిన బండారి మారుతి (43), కాట్నపల్లిలోని సాయి మహాలక్ష్మి ఇండస్ట్రీస్, సౌభాగ్యలక్ష్మి ఇండస్ట్రీస్ మేనేజింగ్ పార్ట్నర్‌పై ప్రివెన్షన్ ఆఫ్ బ్లాక్ మార్కెటింగ్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ సప్లైస్ ఆఫ్ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్–1980 కింద ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) యాక్ట్ అమలు చేయబడింది.

పోలీస్ కమిషనర్ ఉత్తర్వుల మేరకు సోమవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పి. రంజిత్‌రావు, సుల్తానాబాద్ సబ్‌ఇన్‌స్పెక్టర్ చంద్రకుమార్ కరీంనగర్ జిల్లా జైలుకు వెళ్లి జైలర్ సమక్షంలో నిందితుడికి పీడీ యాక్ట్ ఉత్తర్వులనుఅందజేసి,అనంతరం చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించారు. దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం, 2023–24 రబీ, ఖరీఫ్ సీజన్లలో తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థతో కస్టమ్ మిల్లింగ్ ఒప్పందం కుదుర్చుకున్న నిందితుడు మొత్తం 11,213.040 మెట్రిక్ టన్నుల వరిని స్వీకరించి, ప్రభుత్వానికి అప్పగించాల్సిన 7,624.867 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ బియ్యాన్ని ప్రభుత్వానికి అందజేయకుండా అక్రమంగా ఇతర రైస్ మిల్లులకు విక్రయించినట్లు తేలింది.

ఈ చర్యల వల్ల ప్రభుత్వానికి రూ.27 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు దర్యాప్తులో నిర్ధారణ అయింది. నిందితుడిపై 2024 నుంచి 2026 వరకు పెద్దపల్లి,కరీంనగర్ జిల్లాల్లో నాలుగు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి అని తెలిపారు, సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ కేసులో అరెస్టై బెయిల్‌పై విడుదలైన అనంతరం కూడా అదే తరహా నేరాలకు పాల్పడినట్లుపోలీసులుగుర్తించారు.ప్రస్తుతం మరో కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న అతను తిరిగి విడుదలైతే మళ్లీ ప్రజా పంపిణీ వ్యవస్థకు భంగం కలిగించే అవకాశం ఉన్నందున, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా పీడీ యాక్ట్ అమలు చేసినట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వ ధాన్యం అనేది పేదల హక్కు ఆ ధాన్యాన్ని అక్రమంగా దోచుకుని బ్లాక్ మార్కెట్‌కు తరలించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించము.ప్రజల ఆహార భద్రతకు భంగం కలిగించే వారిపై సాధారణ క్రిమినల్ కేసులతోనే ఆగిపోము. అవసరమైతే పీడీ యాక్ట్‌తో పాటు చట్టంలో ఉన్న అత్యంత కఠిన నిబంధనలను అమలు చేస్తాము. సీఎంఆర్ బియ్యం అక్రమ దారిమళ్లింపులో పాల్గొన్న ప్రతి వ్యక్తిని, నిర్వాహకుడిని, సహకరించిన వారిని, లబ్ధి పొందిన వారిని గుర్తించి చట్టం ముందు నిలబెడతాము. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రభుత్వ ధాన్యాన్ని అక్రమంగా దారిమళ్లించే వారిపై ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.

అక్రమాలకు పాల్పడే వారు వెంటనే తమ కార్యకలాపాలను విరమించుకోవాలి. లేకపోతే పీడీ యాక్ట్‌తో పాటు కఠినమైన చట్టపరమైన నిర్బంధ చర్యలు తప్పవు." అని హెచ్చరించారు.ప్రభుత్వ ధాన్యాన్ని అక్రమంగా కొనుగోలు చేయడం,నిల్వ చేయడం,రవాణా చేయడం, విక్రయించడం లేదా ఇటువంటి నేరాలకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సహకరించే వారిపైనా సమానంగా కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు.ఈ కేసులో పీడీ యాక్ట్ అమలుకు కృషి చేసిన పెద్దపల్లి ఏసీపీ కృష్ణ, సుల్తానాబాద్ సీఐ పి. రంజిత్‌రావు,ఎస్సై చంద్రకుమార్‌లను పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అభినందించారు.